ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ ఎంపీలు గత కొంత కాలంగా పార్లమెంట్ వద్ద ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రక రకాల వేషధారణలతో నిరసన తెలుపుతూ..ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఈ రోజు పార్లమెంటు ముందు నిరహార దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలికి వ్యతిరేకంగా నిరశనకు దిగారు.
ఈ రోజు రామ్మోహన్ నాయుడి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆదర్శంగా తీసుకొని ఆయన నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. కాగా నిరాహార దీక్షకు దిగిన రామ్మోహన్ నాయుడికి టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉంటే..నేడు ఉదయం చేపట్టిన నిరాహార దీక్షను మధ్యాహ్నం వరకు విరమించారు.
పార్లమెంటు సమావేశాలు ఈరోజు ముగిసిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు దీక్ష విరమించారు. టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ నిమ్మరసం ఇచ్చి రామ్మోహన్ చేత దీక్షను విరమింపజేశారు. రామ్మోహన్ నాయుడికి మద్దతుగా టీడీపీ నేతలు మురళీమోహన్, గల్ల జయదేవ్ దీక్షలో కూర్చున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరకు, విభజన హమీలను అమలు చేసేవరకూ కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతలు ఇదేం నిరాహాదీక్షలు..అంటూ ఎద్దేవా చేస్తున్నారు.