రాజకీయాలలో నాయకులకు ధైర్యం సహజం. అయితే, ఎన్నికల్లో పోటీ చేసే నేతలకు ప్రతి ఒక్కరికీ ధైర్యం ఉంటుందా? అంటే చెప్పలేని పరిస్థితి! ఎంతో కొంత అధైర్యం వారిని వెంటాడుతూనే ఉంటుంది. కానీ, ఒక్క చీరాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమంచి కృష్ణమోహన్కు మాత్రం ధైర్యం చాలానే కనిపిస్తోంది. తన గెలుపును ఎవరూ ఆపలేరు., ఎవరూ నిర్దేశించలేరనే దూకుడు ఆయనలో కనిపిస్తోంది. మరి ఇంత ధైర్యం వెనుక ఉన్న వాస్తవం ఏంటి? ఎందుకు ఆమంచి అంత సిన్సియర్గా తన విజయం ఖాయమని చెబుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. గత ఎన్నికల విషయానికి వస్తే.. వాస్తవానికి కాంగ్రెస్ నాయకుడే అయినా రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి... స్వతంత్ర అభ్యర్థిగా నవోదయ పార్టీ పేరిట చీరాల నుంచి పోటీ చేశారు.
నిజానికి 1999 తర్వాత చీరాలలో 2004లో రోశయ్య పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ టికెట్పై ఆమంచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమంచి ఇక్కడ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ ఇమేజ్ను ఆమంచి తనకు ఓట్ల రూపంలో అనుకూలంగా మార్చుకోవడంలో 2014లో విజయం సాధించాడు. ఇక, ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోతుల సునీత పోటీ చేసినా.. దాదాపు 10 వేల చిలుకు ఓట్ల మెజారిటీతో ఆమంచి విజయం సాధించారు. మరి ఇంత విజయానికి కారణంపై విశ్లేషణలు చేస్తే.. స్థానికంగా ఉన్న సమస్యలపై ఆమంచికి మంచి పట్టు ఉంది. అదే సమయంలో పేదలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను అక్కడిక క్కడే పరిష్కరిస్తాడనే పేరు తెచ్చుకున్నారు. నిజానికి ఆమంచి తన సొంత నిర్ణయాలతో చేసిన సెటిల్ మెంట్లు.. స్థానికులను ఎంతో ఆకట్టుకున్నాయి.
అదే సమయంలో ప్రభుత్వ ఫలాలను ప్రజలకు అందించడంలోనూ ఆమంచి ముందున్నాడు. ప్రస్తుతం చీరాల నియోజ కవర్గం శివారులో భారీ ఎత్తున 2 వేల మంది పేదలకు గృహాలు నిర్మిస్తున్నారు. వీటిని ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంతోనే నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఇంటింటికీ అందుతున్న సంక్షేమాన్ని తాను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నా.. చక్కని మానిటరింగ్ చేస్తున్నారు. దీంతో పేదల్లో ఆమంచి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాస్లోను, యూత్లోను కూడా ఆమంచి దూసుకుపోతున్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు కొండంత అండగా నిలుస్తున్నాయి.
టీడీపీలో ఇమడని ఆమంచి :
ప్రస్తుతం ఆమంచి టీడీపీలో ఉన్నా... వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ పార్టీ నుంచే పోటీ చేస్తారా ? లేదా ? అన్నది సందేహమే. ఆయన ఎన్నికల వరకు వేచి చూసే ధోరణితో ఉన్నారు. ఆయనకు వైసీపీ నుంచి జనసేన నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన తన వీలును బట్టి మరోసారి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న గ్రిప్ నేపథ్యంలోనే ఆయన సొంతంగా పోటీ చేసినా గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానైనా పోటీ చేస్తానని తనకు పార్టీలతో పని లేదని ఆమంచి చెబుతుండడం గమనార్హం.