రాజకీయాల్లో ఒక్కొక్క సారి పరిస్థితులు ఎలా మారతాయంటే.. చాలా ఘోరంగా ఉంటాయి. ఎటు మాట్టాడినా ముల్లు తమకే గుచ్చుకుంటుందనే కోణంలో రాజకీయాలు మారిపోతాయి. అటు తెలంగాణాలోను ఇటు ఏపీలోనూ చాలా దయనీయ పరి స్థితిలో ఉన్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇలానే ఉంది. తెలంగాణాలో కేసీఆర్పై యుద్దానికి చంద్రబాబును సారధిగా పెట్టుకుని ముందుకు వెళ్లారు. అయితే, బాబు సారథ్యంలో తెలంగాణా రాజ్యాన్ని కైవసం చేసుకుందామని అనుకున్నా.. విఫల ప్రయత్నంగానే మారిపోయింది. దీంతో కాంగ్రెస్ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల్లో సాదించిన రెండు స్థానాలను కూడా పోగొట్టుకుని విపక్ష హోదా కూడా వస్తుందో రాదో తెలియని స్థితిలో కాంగ్రెస్ అల్లాడిపోతోంది.
మరి ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఏంటి? ఎందుకిలా అయింది. ? అనే విశ్లేషణ తాజాగా పూర్త యింది. కాంగ్రెస్ మేధావులు విషయాన్ని తేల్చారు. కానీ, మౌనంగానే ఇళ్లబాట పట్టారు. దీనికి ప్రధాన కారణం.. కాంగ్రెస్ పోయి పోయి టీడీపీతో పొత్తు పెట్టుకున్నందునే ఓటమిపాలయ్యామనేది కాంగ్రెస్ నేతల తీర్మానం. అయితే, దీనిని పైకి చెప్పలేని పరిస్థితి. దీనికికారణం జాతీయస్థాయిలో టీడీపీతోనే కలిసి ముందుకు వెళ్తున్నారు. బాబు సారథ్యంలోనే రాహుల్ బీజేపీయేతర కూటమికి పావులు కదిపారు. ఇక, ఇంతకన్నా కీలకమైన విషయం ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తుండడం. ఏమాత్రం అడ్రస్లేని కాంగ్రెస్.. వచ్చేఎన్నికల్లో ఇక్కడ కనీసం పది లేదా కనీసంలో కనీసం ఓ నాలుగు స్థానాల్లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది.
అయితే, సొంత బలం లేకపోవడంతో ఇప్పుడు టీడీపీతోనే జట్టు కట్టి.. ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి దీంతో కక్కలేక మింగలేక నాయకులు టీడీపీపై మచ్చపడకుండా చేసుకుంటున్నా రు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కిశోర్ చంద్రదేవ్.. టీడీపీని వంక పెట్టడానికి వీల్లేదంటూ సర్టిఫికేట్ ఇచ్చాడు. బాబు పాలన భేష్ అంటూ కితాబు నిచ్చారు. అంతేకాదు.. బాబు ప్రచారం చేయడం వల్లే తెలంగాణాలో కాంగ్రెస్కు 19 సీట్లు వచ్చాయని తీర్మానించాడు. ఇక, టీఆర్ ఎస్ కూడా బాబు వల్ల కాంగ్రెస్ ఓడిందని చెప్పడంలేదు. ఎందకంటే.. బాబు వల్లే తాము గెలిచామనే పాయింట్ తెరమీదికి వస్తున్న నేపథ్యంలో టీఆర్ ఎస్ కూడా వ్యూహాత్మంగా వ్యాఖ్యలు చేస్తోంది ఇలా ఎలా చూసినా టీడీపీపై మచ్చపడడం లేదు!!