ఆయన మాజీ కేంద్ర మంత్రి.. అందులోనూ ఓ వ్యాపార సామ్రాజ్యానికి రాజు. వేల కోట్ల ఆస్తులున్న సంపన్నుడు. ఓ పార్టీని కష్టకాలంలో పోషించిన రాజకీయ నాయకుడు. పాపం.. అంతటి ఘన కీర్తి ఉన్నా.. ఆయనకూ ఆకలిబాధ తప్పలేదు. అన్నమో రామచంద్రా.. అని అలమటించక తప్పలేదు.
ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఆయనే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. అవును నిజం.. ఆయన ఇటీవల ఆకలిబాధతో మలమల మాడిపోయారట. ఆయనకు అంత కష్టం ఎందుకొచ్చిందంటారా.. ఆయన్ను ఇటీవల ఆరువేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఆ సమయంలో పాపం భోజనం కూడా పెట్టకుండా క్షుద్బాధతో విలవిల్లాడేలా చేశారని కోర్టుకు విన్నవించుకున్నారు.
విచారణకు పిలిపించిన ఈ డీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం కూడా ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టుకు తెలియచేశారట. అలా తనకున్న మానవ హక్కులను ఉల్లంఘించారని కోర్టుకు చెప్పారట. ఐతే.. ఈ ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించారు. తాము ఆహారం ఇస్తానన్న సుజనా చౌదరే తీసుకోలేదని చెప్పారు.
విచారణ సమయంలో సుజనా చౌదరి ఆహారం తిరస్కరించగా.. పండ్లు ఇచ్చామని.. సుజనా చౌదరి అరటిపండ్లు తిన్నారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను సుజనా తరపు న్యాయవాది తోసిపుచ్చారు. తీవ్రమైన ఆర్థిక నేరానికి చెందిన ఈ కేసు విచారణలో ఆహారం, అరటిపండూ అంటూ సాగడం విచిత్రమే.