తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. ఈ సమయంలో గులాబీ పార్టీలోని కీలక నేత హరీశ్ రావు భవితవ్యంపై ఆసక్తికరమైన కథనాలు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆయన.. కేసీఆర్ కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడంతో డైలమాలో పడ్డారు.
ఓవైపు పార్టీలో, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో ఆయన తిరుపతి దైవ దర్శనానికిి వెళ్లారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని హరీశ్ పరుగులు పెట్టించారు. కానీ తాజాగా కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో హరీశ్ పాల్గొనలేదు. ఈ సంకేతాలను బట్టి చూస్తే వచ్చే కేబినెట్లో హరీశ్ కు స్థానం దక్కకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో అటు హరీశ్ రావుకు.. ఇటు కేటీఆర్ కూ ఇద్దరికీ మంత్రిపదవులు దక్కకపోవచ్చని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఈ కథనం ప్రకారం.. హరీశ్ రావును వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో దింపవచ్చని తెలుస్తోంది. కేటీఆర్ పార్టీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల మంత్రివర్గంలో చేర్చుకోరాదని కేసీఆర్ భావిస్తున్నారు.
హరీశ్ ను ఎంపీ చేసి ఢిల్లీ పంపిస్తే.. ఇక్కడ కేటీఆర్ పని కూడా సులువుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీశ్ ఇద్దరికీ మంత్రిపదవులు ఇస్తే మరోసారి కుటుంబ పాలన అన్న విమర్శలు వస్తాయని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఇస్తే ఇద్దరికీ ఇస్తారని.. లేకుంటే ఇద్దరికీ ఇవ్వరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.