రాజధాని జిల్లాలో టీడీపీ మరింత పటిష్టంగా మారేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ మూడు ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అదే సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన చోట్లా విజయం సాధించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఈ ఐదు స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇక, ప్రస్తుత సిట్టింగుల్లో రిటైర్ అయ్యేవారిని పక్కన పెట్టి.. వారి వారసు లకు టికెట్ ఇవ్వాలా వద్దా? అనే విషయంపై దృష్టి పెట్టాలని కూడా బాబు నిర్ణయించుకున్నారు. ఇక, ఇదే క్రమంలో పదవులను అడ్డు పెట్టుకుని కుటుంబ సభ్యులు చేస్తున్న పెత్తనానికి కట్ చెప్పాలని కూడా బాబు భావిస్తున్నట్టు సమాచారం.
తీయ స్థాయిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త మిత్రులు కలవడం, పాత మిత్రులు శత్రువులుగా మారడం, టికెట్టు ఆశించేవారి సంఖ్య పెరగటం... జాతీయస్థాయిలో అన్ని పార్టీలు చంద్రబాబు వైపు చూడటంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సుకత పెరిగింది. ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న పార్టీ, నామినెటేడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయటానికి అధిష్టానం నిర్ణయించింది. ప్రధానంగా మిర్చియార్డు పాలకవర్గం, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్, అర్భన్ పార్టీ అధ్యక్ష పదవి, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి తదితర పోస్టులను వెంటనే నియమించేందుకు పార్టీ జిల్లా అగ్రనాయకత్వం చర్యలు తీసుకుంటోంది. నాయకులు తమ నియోజకవర్గంపై దృష్టి సారించి గెలుపు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించింది.
తొలి దశలో వైసీపీ గెలుపొందిన ఐదు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వంపై దృష్టి పెట్టింది. రెండో దశలో సిట్టింగ్ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు అంశాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వడపోతలో భాగంగా నిఘా వర్గాల నివేదికలను అనుసంధానం చేస్తున్నారు. వయె భారంతో వైదొలిగే నేతలు.. వారసులు, కొత్త ఆశావాహులు, కొత్త సమీకరణలతో తెరపైకి వచ్చే పొత్తులు.. ఒక వేళ కొత్త పొత్తులు అమలులోకి వస్తే త్యాగాలకు సిద్ధం కావాలంటూ కొంత మంది సంకేతాలు పంపుతున్నారు. దూరమైన ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ వర్గాలను అక్కున చేర్చుకునే పనిలో తలమునకలయ్యారు. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిందని పార్టీ శ్రేణులు రుసరుసలాడుతున్నాయి. వీటన్నింటిపై చంద్రబాబు దృష్టి పెట్టి వారిని అమరావతికి పిలిచి హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది.