రాజకీయాలు అన్న తర్వాత ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రతి పక్ష హోదాలో ఉన్న రాజకీయ నేతలు ఏ క్షణంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారో తెలియన అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ మద్య తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్వేల ఫలితాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ దక్కించుకుంది. టీఆర్ఎస్ 89 సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ని మట్టి కరిపించడానికి టి కాంగ్రెస్ తో పాటు టిటిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.
మహాకూటమి తరుపు నుంచి భారీ స్థాయిలో ప్రచారం కొనసాగింది. కేంద్రం నుంచి సోనియాగాంధీ, రాహూల్ గాంధీ ప్రచారం చేయగా..ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రచారం లో పాల్గొన్నారు. ఇక సినీ నటి కుష్బు సైతం ప్రచారం కొనసాగింది. ఇంత చేసినా చివరికి ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే జై కొట్టారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం గా రెండవ సారి కేసీఆర్ నియమితులయ్యారు. ఆ మద్య కాంగ్రెస్ నుంచి కొంత మంది నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ అవుతున్నారని వార్తలు వచ్చాయి. నిజంగానే కాంగ్రెస్ కి షాకింగ్ న్యూస్..ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్లు గురువారం రాత్రి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. వీరి మద్య దాదాపు గంటన్నర సేపు చర్చలు నడిచాయి. దాంతో ఆ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ లో కలవడం ఖాయమని చెబుతున్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనను అభినందించేందుకే ప్రగతి భవన్కు వెళ్లినట్టు లలిత అనుచరులు చెబుతున్నప్పటికీ పార్టీ మారడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
కాగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన లలిత టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు కరీంనగర్కు చెందిన మరో నేత సంతోష్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్తో కలిసి ఆయన ప్రగతి భవన్కు వచ్చారు. కేసీఆర్ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. మరి ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ అధినేతలు బుజ్జగిస్తారా..లేక టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది.