వారిద్దరూ సినిమా హీరోలు. తెరమీద ప్రేక్షకులను అలరించిన వారే. అయితే, ఒకరు ఓల్డ్ హీరో కాగా, మరొకరు మాత్రం కుర్ర హీరో. కానీ, వీరిద్దరూ ఇప్పుడు ఒకే రాజకీయ రంగస్థలంపై ప్రజల మధ్యకు వస్తున్నారు. ఒకరితో ఒకరు రాజకీయంగా పోరాడేందుకు రెడీ అయ్యారు. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనే ప్రశ్న సర్వసాధారణం. రాజకీయాల్లో ఎంతటి ఉద్ధండులు ఒకే స్థానం నుంచి పోటీ చేసినా.. గెలుపు ఒకరినే కదా వరించేది. ఇప్పుడు ఇలాంటి సన్నివేశమే.. రాజమండ్రిలో చోటు చేసుకోనుంది. ఇప్పటికే రాజమండ్రి ఎంపీగా ఉన్నారు మురళీమోహన్. ఈయన గతంలో సినీ హీరోగా ప్రజలను బాగానే రంజింపజేశారు. 2009లో ఒకింత తేడాతో తప్పిన విజయాన్ని 2014లో అందుకున్నారు.
ప్రస్తుతం రాజమండ్రిలో మంచి పేరు సంపాయించుకున్నారు కూడా. అయితే, తన ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నా ళ్లపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కోడలు రూపాదేవి అరంగేట్రం చేశారు. మామ గారి తరఫున ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక మురళీ మోహన్ తప్పుకొని ఆమె రంగంలోకి దిగి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించడంతో ఇక, వచ్చే ఎన్నికల్లోనూ మురళీ మోహనే రంగంలోకి దిగుతారనే ప్రచారం ఊపందుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ సీటులో పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ మురళీ మోహన్ను దీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, వర్ధమాన సినీనటుడు మార్గాని భరత్ను (ఓయ్ నిన్నే సినిమా హీరో) వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అసలు సిసలు సినిమా ప్రారంభమైంది. ఎంపీగా ఈ అయిదేళ్లలో చేపట్టిన అభివృద్ధే తనను మళ్లీ గెలిపిస్తుందని మురళీ మోహన్ ధీమాతో ఉండగా.. మురళీమోహన్ పనితీరుపై కొంతమంది నాయకులు, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, ఇది తమకు విజయాన్ని కైవసం చేస్తుందని వైసీపీ అంటోంది. ఈ విషయమే స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారి రాజమహేంద్రవరం పార్లమెంట్ టికెట్ను బీసీ వ్యక్తికి వైసీపీ కన్ఫాం చేసింది. మరి వైసీపీ ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ ఇద్దరు సినీ హీరోల్లో ఎవరు గెలుస్తారోననే టెన్షన్ మాత్రం రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.