విజయాలకు తండ్రులు అనేకులు. ఎవరికి వారు దాన్ని తమ ఖాతా లో జమ చేసుకోవాలని అనుకుంటారు. కాని అపజయానికి తాను తండ్రినని ఏవరూ చెప్పరు. అందుకే అపజయం అనాధ. అంతేకాదు అపజయాన్ని వీలున్నంతవరకు ప్రత్యర్ధులపైకి నెట్టేయటం రాజకీయాల్లో సహజం. అయితే ఇప్పుడు ఎన్నికల్లో తమ రాజకీయ వైఫల్యాన్ని ప్రాణం లేని ఈవీఎం లపైకి నెట్టేస్తున్నారు మన రాజకీయ నాయకులు. 'మగటిమిలేని వాళ్ళకు మంగళవారం ఒక సాకు' అంటారు పెద్దలు. వీళ్ళ వైఫల్యానికి ఈవీఎం లు ఒక సాకు.
"కంప్యూటర్ జాతి పిత" నని తనకు తానే చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణాలో తమ వైఫల్యాన్ని నిస్సిగ్గుగా ఈవీఎం లపైకి నెట్టేశారు. అలాగే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తమ వైఫల్యానికి ఈవీఎం లు కారణం కావచ్చన్నారు. అదే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తిస్ గఢ్ లో వారి విజయానికి ఈవీఎం లు కారణమని అనటం లేదు. అయితే ఈవీఎం ల విషయంలో భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఈ మద్య ఒక మీడియా ఇంటర్యూలో తన ఆవేదనను వెలిబుచ్చుతూ, ఈవీఎం లపై తన విశ్వాసనాన్ని పునరుద్ఘాటించటం అభినందించవలసిన విషయం.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్లను (ఈవీఎంలు) ఎవరూ తమకు తగిన విధంగా ప్రోగ్రాం చేయలేరని అలాగే వాటిని ట్యాంపర్ చేయడం సాధ్యం కాని పని అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులు పార్టీలు తమ తమ చర్చల్లో ఈవీఎం లపై తమ వైఫల్యాలను నెట్టేసి "ఫుట్బాల్ ఆడుతూ వుండటం" తనను బాధిస్తోందని అన్నారు. బ్యాలెట్ పేపర్ల విధానానికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ఇప్పుడు ఈవీఎంలు సరిగా పని చేయని సంఘటనలను కూడా చాలా తక్కువ సంఖ్యలు తీసుకొచ్చామని ఇంకా తగ్గించేందు కు ఎన్నికల సంఘం (ఈసీ) కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం లో తామేమీ అసన్తృప్తిగా లేమన్నారు. నిన్న గురువారం సీఈసీ గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఒక వార్తాసంస్థ తో ముచ్చటించారు.
EVM challenge: No proof given by those who alleged EVM tampering says CEC Nasim Zaidi announces June 3, 2017 for hacking challenge | India News - Times of India
ఈవీఎంల ట్యాంపరింగ్ ఒక అసందర్భ విషయమైతే అవి పనిచేయకపోవడం అనేది సాంకేతిక విషయమని - ఈ రెండూ వేర్వేరు అంశాలని సునీల్ అరోరా వివరించారు. పనిచేయకపోవడం జరగడానికి అప్పుడప్పుడూ అవకాశం ఉంటుదని, ఇది అన్నీ ఎలక్ట్రానిక్ యంత్రాల విషయంలో జరిగేదేదని దానికి వెంటనే పరిష్కారాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో 1.76 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అదే సంఖ్యలో ఈవీఎం లను వినియోగించినట్లు తెలిపారు. వాటిలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే ఈవీఎం లు సరిగా పనిచేయని సంఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించారు. ఆ మాత్రం కూడా లేకుండా చూడాలన్నదే ఈసీ లక్ష్యంగా తెలిపారు. ఈవీఎం అనేది ఓట్లను నమోదు చేసే యంత్రమే నని, దాన్ని ఎవరూ నియంత్రించ లేరని స్పష్టం చేశారు. డిల్లీలో 2014 లోక్-సభ ఎన్నికల్లో ఒక లాంటి ఫలితం, తర్వాత అక్కడే జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరోక ఫలితం వచ్చిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
అలాగే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లోనే కాకుండా, ఉప ఎన్నికల్లో సైతం వేర్వేరు ఫలితాలు వచ్చినట్లు గుర్తుచేశారు. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీల ఆరోపణలను ప్రస్తావించగా - ఫలితం ‘ఎక్స్’ అయితే సరే.. అదే ‘వై’ అయితే మాత్రం ఈవీఎంలది తప్పుగా చూపిస్తున్నారని అరోడా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఈసీని లక్ష్యంగా చేసుకుని నిష్పాక్షికతను ప్రశ్నించడం తనను బాధిస్తోందన్నారు.
ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల తర్వాత రాజకీయ పార్టీలు అతి ముఖ్యమైన భాగస్వాములని సునీల్ అరోరా పేర్కొన్నారు. రాజ్యాంగస్ఫూర్తి, దాని మార్గదర్శకత్వంలో నిజాయతీతో ఎన్నికల వ్యవస్థ లోని అందరు భాగస్వాముల అంచనాలకు అనుగుణంగా అత్యుత్తమంగా పనిచేసేందుకు ఎన్నికల సంఘంలోని ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు చెప్పారు.
అతిత్వరలో జరగనున్న లోక్-సభ ఎన్నికల కోసం తామంతా అప్రమత్తంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లు కొద్దికాలం క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘంలోని ప్రతి ఒక్కరం రాజకీయ పార్టీలు, పౌరసమాజ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాలతో పాటు భాగస్వాములందరి సహకారాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.