అధికార టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందనేది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన, ఆశ, ఆంత ర్యం కూడా! పైగా ఇప్పుడు ఇది ఇజ్జత్కా సవాల్! తెలంగాణాలో ఆయన వైరి పక్షం నాయకుడు కేసీఆర్ ముందస్తుకు వెళ్లి .. ప్రజల మద్దతు గతంలో కంటే ఎక్కువగా కూడా కూడగట్టుకుని తిరుగులేని సర్వాధిపతిగా మారిపోయాడు. ఆయనను ప్రశ్నించే వారిని కూడా లేకుండా చేసుకుంటున్నారు. మరి ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడమే కాదు.. ఇప్పుడున్న ప్రతిపక్ష బలం గణనీయంగా తగ్గాలని చంద్రబాబు కోరుతున్నారు. తనను ప్రశ్నించే రేంజ్లో ఎవరూ ఉండకూడదని కూడా ఆయన అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆయన అడుగడుగునా అనేక చర్యలు చేపడుతున్నారు. ప్రతి విషయాన్నీ చాలా కూలంకషంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ్ముళ్లకు దిశానిర్దేశం చేసేందుకు ప్రయ త్నించారు. అయితే, అనూహ్యంగా తమ్ముళ్లు తమ దారిలో తాము నడుస్తున్నామనే దీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. తాజా గా నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో చాలా మంది పార్టీలో కొంత కాలంగా అంటీ ముట్టకుండా ఉన్నవారు కూడా ఉండడం. దీంతో వీరంతా ఇక, తట్టబుట్ట సర్దుకునేందుకు రెడీ అవుతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే, వీరంతా గెలుపు గుర్రాలే కావడంతో చంద్రబాబు వీరిని బుజ్జగించాలని అనేవారు కొందరైతే.. కొందరు మాత్రం బాబు వ్యవహార శైలిపై పెదవి విరుస్తున్నారు. అసలు ఎమ్మెల్యేల మనసుల్లో ఏముందో తెలుసుకోకుండానే ఇలా వ్యాఖ్యానించడం ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసం కాదని అంటున్నారు. తెలంగాణా విషయాన్ని తీసుకుంటే. అక్కడ టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేల్లో భరోసా నింపారు. ఆది నుంచి కూడా ఎమ్మెల్యలపై సర్వేలు చేయిస్తూనే.. ఆయన వారికి అండగా నిలబడుతున్నారు. ఇక, ఎన్నికలకు వెళ్లేందు కు ఏడాది ముందుగానే ఆయన తన ఎమ్మెల్యేలకు సిట్టింగులు అందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇక, ఒకరిద్దరు మంత్రులుగా అవకాశం రానివారిని కూడా బుజ్జగించారు. ఇలా తను ఒక పిలుపు ఇస్తే.. తన దగ్గరకు వచ్చేలా ఎమ్మెల్యేల ను మలుచుకోవడంలో విజయం సాధించారు. అయితే, ఏపీలో మాత్రం ఎమ్మెల్యేల్లో ఎప్పడు భరోసా కనిపించడం లేదు. ఎంతసేపూ ఛీత్కారం, హెచ్చరికలు, సర్వేల పేరుతో ఉరుకులు, పరుగులే కానీ, అసలు ఎమ్మెల్యేల మనసులో ఏముంది? అనే విషయాన్ని బాబు పరిశీలించకపోవడమే వారిని బాబుకు దూరం చేస్తోందనే విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ముందు మారాల్సింది బాబే అనే తీర్మానాలు కూడా తెరమీదికి వస్తుండడం గమనార్హం.