సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
విడుదల చేసిన లక్ష్మీస్ ఎన్టీయార్ బయోపిక్ లోని కుట్ర పాట తెలుగుదేశంపార్టీలో
కలకలం రేపుతోంది. ఎన్టీయార్ బయోపిక్ కు సంబంధించిన ట్రైలర్, పాట ఒకేరోజు
విడుదలవ్వటంతో ఎవరి ట్రైలర్ జనాలను ఆకర్షిస్తుందో అన్న ఉత్కంఠ జనాల్లో
పెరిగిపోయింది. ఎన్టీయార్ కొడుకు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఎన్టీయార్
బయోపిక్ కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అదే సందర్భంగా వర్మ తీస్తున్న అదే
ఎన్టీయార్ బయోపిక్ లోని కుట్ర పాట కూడా రిలీజయింది. దాంతో బాలకృష్ణ తీస్తున్న
బయోపిక్ కు వర్మ తీస్తున్న బయోపిక్ పోటీగా మారిపోయింది.
సరే బాలకృష్ణ తీస్తున్న బయోపిక్ లో ఎన్టీయార్ కు సంబంధించిన కాన్ట్రవర్సీస్ ఏమీ ఉండవన్నది అందరూ అనుకుంటున్నదే. ఎన్టీయార్ జీవితంలో కాంట్రవర్సీస్ ఏమన్నా ఉందంటే అది రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాతే. అదికూడా 1984లో మొదటి సాని నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచి ఎన్టీయార్ ను ముఖ్యమంత్రిగా దింపేసినపుడు. రెండోసారి చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచి సిఎం పదవిని లాక్కున్నపుడు. మొదటిసారంటే నాదెండ్ల పరాయివ్యక్తి కాబట్టి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే, తర్వాత మళ్ళీ ఎన్టీయార్ కోలుకుని నాదెండ్ల ప్రభుత్వాన్ని నెలరోజులకే రాజీనామా చేయక తప్పని పరిస్దితి సృష్టించారు. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ అధాకారం అందుకున్నారు.
కానీ రెండోసారి వెన్నుపోటు పొడిచినపుడు అలా జరగలేదు. స్వయంగా అల్లుడు చంద్రబాబే వెన్నుపోటు పొడవటాన్ని ఎన్టీయార్ తట్టుకోలేకపోయారు. అందునా పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరితో పాటు నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ తదితర కుటుంబసభ్యులందరూ కలిసే రామారావుకు వెన్నుపోటు పొడిచారు. తన కూతుర్లు, కుమారులు, అల్లుళ్ళు కలిసి తనను దెబ్బ కొట్టటాన్ని ఎన్టీయార్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో మరణించారు. చివరకు మరణం కూడా పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఎన్ని గంటలకు, ఎలా చనిపోయారో కూడా ఎవరూ స్పష్టంగా చెప్పలేకున్నారు.
మరణానికి ముందు స్వయంగా ఎన్టీయారే తనకు జరిగిన అన్యాయంపై ఇంటర్వ్యూలిచ్చారు. అందులో చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టారు. ఆ వీడియోలు ఇఫ్పటికీ యూట్యూబ్ లో జనాలకు అందుబాటులోనే ఉన్నాయి. తండ్రి వివాదాస్పద రాజకీయ జీవితంపై కొడుకు బయోపిక్ తీస్తున్నారంటే అందులో ఏముంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అప్పటికీ ఇఫ్పటికీ చంద్రబాబే సిఎం. పైగా బాలకృష్ణ, చంద్రబాబు వియ్యంకులు. బాలయ్య హిందుపురం ఎంఎల్ఏ కూడా. కాబట్టి బాలకృష్ణ తీస్తున్న ఎన్టీయార్ బయోపిక్ లో చంద్రబాబును విలన్ గా చూపించే అంశాలేవి ఉండవన్నది అందరికీ తెలిసిందే.
అందుకే అసలైన నిజాలను తాను తన బయోపిక్ లో చూపిస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించగానే అందరిలోను ఉత్కంఠ మొదలైంది. దానికి తగ్గట్లుగా రిలీజైన కుట్ర పాటలో మొత్తం చంద్రబాబునే ప్రముఖంగా చూపిస్తూ ఎన్టీయార్ ను పదవిలో నుండి దింపేయటానికి సహకరించిన వారందిరి ఫొటోలు చూపంచటంతో సంచలనం మొదలైంది. పాట విడుదలైన దగ్గర నుండి తెలుగుదేశంపార్టీ నేతలు, శ్రేణులు వర్మపై మండిపోతున్నారు. పాటల తాలూకు పోస్టర్లను, వర్మ పోస్టర్లను తగలబెడుతున్నారు. పాట రిలీజైన 24 గంటల్లోనే సుమారు 10 లక్షల మంది చూశారంటేనే ఎంత ఉత్కంఠ రేపిందో అర్ధమైపోతోంది. అందుకనే జనాలకు నిజాలు తెలీకూడదనే టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు. మరి సినిమా పూర్తయిన తర్వాత రిలీజైతే ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాల్సిందే.