రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ లో అగ్రనాయకుడు.. గత ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఐకాన్ గా నిలిచాడు. కానీ అనూహ్యంగా గులాబీ పార్టీ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. అతితక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయాడు. కొండగల్ కింగ్ గా పేరున్న ఆయన ఓటమి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేసీఆర్ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేశారు. హరీశ్ రావు వంచి స్ట్రాటజిస్టుకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన గట్టి పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఐతే.. పోలింగ్కు నాలుగైదు రోజుల ముందు జరిగిన పరిణామాలు రేవంత్ రెడ్డికే అనుకూలమని అంతా భావించారు.
కొండగల్ లో కేసీఆర్ సభ, దాన్ని అడ్డుకోవాలని రేవంత్ బంద్ కు పిలుపు ఇవ్వడం.. పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం అంతా రేవంత్ కు ప్లస్ అవుతాయనుకున్నారు. కానీ ఎన్నికల్లో మాత్రం రేవంత్ ఓడిపోయారు. ఐతే.. ఇప్పుడు రేవంత్ ఓటమికి ఆయన న్యాయవాదులు చెబుతున్న కారణం ఆసక్తికరంగా ఉంది. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం వల్ల .. ఆయన చివరి రోజుల్లో ప్రచారం చేసుకోలేకపోయారని.. అందుకే ఓడిపోయారని హైకోర్టులో రేవంత్ తరపు న్యాయవాది చెప్పడం విశేషం.
రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టులో కేసు విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. ఏదో కోర్టు చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ.. అసలు కారణం అది కాదని రేవంత్ టీమ్ కూ తెలుసు. ఎలాగూ గెలుస్తానన్న రేవంత్ అతి విశ్వాసం, గులాబీ పార్టీ పకడ్బందీ వ్యూహాలే రేవంత్ను ఓడించాయి.