ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగట్టే పనిలో ఉన్నారు. మోడీపై రాజకీయంగా కసి తీర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మూడు దశాబ్దాల వైరాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ తో చేతులు కలిపారు.
ఇందుకు చంద్రబాబు చెబుతున్న కారణం మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారన్నది. మోడీ దేశంలోనే వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టిస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. దేశాన్ని మోడీ నుంచి కాపాడేందుకే కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నామంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా చంద్రబాబు ప్రయత్నాలకు కౌంటర్ ఇచ్చారు.
ఆ కౌంటర్ కూడా తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రస్తావనతో ఉండటం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రాంతీయపార్టీలను అణగదొక్కిందని ఆరోపించిన మోడీ అందుకు ఎన్టీఆర్, ఎమ్జీఆర్లను ఉదాహరణగా చూపారు. రాజకీయ దిగ్గజాలైన ఆ మహా నేతలను కాంగ్రెస్ అవమానించిందని మోడీ గుర్తు చేశారు.
ఎన్టీఆర్, ఎమ్జీఆర్లను కాంగ్రెస్ అణగదొక్కిన తీరును చంద్రబాబు వంటి వారు మర్చిపోయినా.. ప్రజలు మర్చిపోరంటూ మోడీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు భాజపా వ్యతిరేక కూటమిలో ఉన్న పార్టీల నేతలను గతంలో ఎమర్జన్సీ సమయంలో కాంగ్రెస్ ముప్పు తిప్పలు పెట్టిన విషయం మరచిపోరాదని మోడీ గుర్తు చేశారు.