నిన్నటి రోజు సుఖం నేదు దుఖం అవుతుంది. మొన్నలా నిన్న ఉండదు. ఇదే క్యాలండర్ మాయ. చూస్తూండగానే మరో ఏడాది కాలగర్భంలో కలసిపోతోంది. కాలానిది తీరని దాహమైతే నెలలు, సంవత్సరాలు అందులో ఆహుతి అయిపోతున్నాయి. ఈ మధ్యలో ఏపీ రాజకీయాలు తీసుకుంటే ఎన్నో మార్పులు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి.
మూడు ముక్కలు :
ఇక 2018 మొదలయ్యేనాటికి ఏపీలో మూడు పార్టీలు కలసి ఉండేవి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక్కటిగా ఉంటూ న్యూ యియర్ కి గ్రాండ్ గా వెల్ కం చెప్పాయి. ఆ తరువాత అంటే మార్చి నెలలో జనసేన పార్టీ టీడీపీకి దూరంగా జరిగింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన జనసేన ప్లీనరీలో పవన్ కళ్యాన్ టీడీపీపై ఘాటు కామెంట్స్ చేస్తూ అవినీతిమయం బాబు పాలనా కాలమంటూ మిత్రుని స్థానం నుంచి తప్పుకున్నారు. ఇక ఆ నెలలోనే కేంద్రంలోని బీజేపీ నుంచి తప్పుకుని టీడీపీ మోడీ సర్కార్ పై నేరుగా యుధ్ధానికి తెర తీసింది. దాంతో టీడీపీ మిత్రులు ముగ్గురివీ మూడు దార్లు అయ్యాయి.
దీక్షలతో జనంలోకి :
బీజేపీ విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేదని చెబుతూ టీడీపీ ధర్మ పోరాట దీక్షలను చేపట్టింది. ఈ ఏడాది మొత్తం దాదాపుగా అన్ని జిల్లాల్లో దీక్షలు చెపట్టింది. ఇక మరో వైపు కొత్త నేస్తాలను కూడా టీడీపీ వెతుక్కునే పనిలో సక్సెస్ అయింది. కర్నాటక ఎన్నికల అనంతరం జేడీఎస్ కాంగ్రెస్ సర్కార్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళడం హైలెట్ అయింది. ఆయన అక్కడ రాహుల్ గాంధీతో కలసి పొటోలకు పోజులు ఇవ్వడంతోనే ఆయాన్ రూట్ క్లియర్ అయింది.
ఆ తరువాత వేగంగా మారిన రాజకీయ వాతావరణంలో తెలంగాణాలో ప్రజాకూటమి పేరిట చంద్రబాబు కాంగ్రెస్ తో కలసిపోటీ చేయడం జరిగింది. తెలంగాణాలో గెలిస్తే ఏపీలోనూ ఆ జోరు కొనసాగించి కేంద్రంలో చక్రం తిప్పుదామని భావించిన బాబు ఆశలు అడియాశలు అయ్యాయి. దారుణంగా ప్రజా కూటమి ఓటమి పాలు కావడంతో బాబు ఇమేజ్ డ్యామేజ్ కావడమే కాదు. ఏపీలోనూ కాంగ్రెస్ పొత్తులపై సందేహం ఏర్పడింది.
గడ్డు కాలమేనా:
ఇక మరో వైపు బంపర్ మెజారిటీతో గెలిచిన కేసీయార్ బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కలకలం రేపారు. అలాగే, ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీయార్ అన్ని రాష్ట్రాలూ తిరుగుతూ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా అనేక మార్పులు బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పాదయాత్రలతో వైసీపీ బాగా పుంజుకోవడం, జనసేన పవన్ సైతం తన పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్ళడం ఈ ఏడాదిలో కీలకమైన మార్పులు.
పవన్, జగన్ కలసి కూటమి కడతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో, మరో వైపు ప్రజా వ్యతిరేకత బాగా పెరుతున్న తరుణంలో టీడీపీకి అన్ని వైపులా గట్టిగా సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఎన్నికల ఏడాది 2019లో టీడీపీ ఏ మేరకు తన సత్తాను చాటుకుంటుందో చూడాలి.