నేటి సమాజంలో మానవత్వం పూర్తిగా నశించిపోతుంది. క్షణికావేశాలతో మంచీచెడు మరచి అయిన వారిని సైతం అత్యంత దారుణంగా కడతేర్చుతున్నారు. పరువు హత్యలు, అక్రమ సంబంధాలు, డబ్బు కోసం ఇలా కారణాలు ఏవైనా ఐనవారిని సైతం అన్యాయంగా హతమార్చుతున్నారు. తాజాగా భీమా డబ్బు కోసం కన్న తండ్రిని దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మాటూరుపేటలో 13న జరిగిన అనుమానాస్పద మృతి కేసు నమోదు అయ్యింది. పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకోవడంతో ఒక్కో రహస్యం బయట పడింది. బీమా(ఇన్సూరెన్స్) డబ్బు వస్తుందనే ఆశతో స్నేహితుడితో కలిసి తండ్రిని హత్యచేసినట్లు మధిర రూరల్ పోలీసులు తమ విచారణ తేల్చారు.
వివరాల్లోకి వెళితే..మధిర మండలం మాటూరుపేటకు చెందిన మేడిశెట్టి ఉద్దండు (57) ఈనెల 13న నిదానపురం క్రాస్ రోడ్డు సమీపంలో సఖినవీడురోడ్డులోని కాలు వ వద్ద విగతజీవిగా కనిపించాడు. భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లవనకుమార్ కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ కేసులో ఉద్దండు కొడుకు క్రిష్ట పై అనుమానం కలిగింది..దాంతో ఆ దిశగా దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అయితే ఉద్దండు కొడుకు కిష్ట్ర ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ ఆటో కూడా తన తండ్రిది కావడం..ఎలాగైనా ఆటో పై వచ్చే ఇన్సురెన్స్ డబ్బులు కొట్టేయాలనే దుర్భుద్ది పుట్టింది.
అప్పటికే కిష్ట్ర పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడు. ఇదే ఆలోచనతో తన స్నేహితుడితో తన తండ్రిని చంపేందుకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారం 13న తండ్రికి మద్యం తాగించి బహిర్భూమికని చెప్పి సఖినవీడు రోడ్డుకు తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై వెళ్లారు. క్రిష్ట డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి ఉద్దండు, అతని స్నేహితుడు దుర్గారెడ్డి వెనుక కూర్చున్నారు.
సమీపంలో ఉన్న సాగర్ కాల్వ వద్ద దించి దుర్గారెడ్డి ఉద్దండు మెడకు కండువా చుట్టి బిగించి చంపాడు. ఆతర్వాత తమకు ఏమీ తెలియనట్లు ఇద్దరూ ఇంటికి వెళ్లారు. అంతే కాదు తన తండ్రి ఎటో వెళ్లినట్లు నాటకాలు ఆడారు. కానీ పోలీసులు తమదైన శైలిలో కిష్ట్ర నోటి వెంట అసలు నిజం చెప్పించేలా చేశారు. బీమా డబ్బుపై ఆశతో తండ్రిని చంపినట్లు విచారణలో ఒప్పుకొన్నాడు. దీంతో ఇద్దరినీ సోమవారం అరెస్ట్చేసి రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.