2019 ఎన్నికలకు గెలుపు గుర్రాలను దింపే పనిలో జగన్ నిమగ్నం అయిపోయాడు. ఎట్టి పరిస్థితిలో ఈ సారి అధికారం చేజార్చుకుడదని జగన్ ఆలోచిస్తున్నాడు. వైకాపా గత ఎన్నికల్లో నెగ్గిన సీట్ల విషయానికి వస్తే.. కడప నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేయవచ్చు. ఇక్కడ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాబబుల్స్ లో ఇద్దరి పేర్లూ ఉన్నాయి. ఇక ఒంగోలు నుంచి వైఎస్ షర్మిల పోటీచేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
వైవీ సుబ్బారెడ్డిని జగన్ పార్టీ అవసరాలకు మళ్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజంపేట నుంచి మిథున్ కు బదులుగా ఆయన తండ్రి రామచంద్రారెడ్డి పోటీచేసే అవకాశాలున్నాయి. మిథున్ ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాలున్నాయి. తిరుపతి ఎంపీగా గత ఎన్నికల్లో నెగ్గిన వరప్రసాద్ కు మళ్లీ ఈసారి అవకాశాలు తక్కువే అని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పటికైతే ఎవరూ ప్రత్యామ్నాయ నేత కనిపించడం లేదు. వరప్రసాద్ కే టికెట్ ఖాయమైందని చెప్పాలి.
కర్నూలు సీటును బీసీలకు కేటాయిస్తానని జగన్ ఇదివరకే ప్రకటించాడు. ఆ మేరకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. నంద్యాల నుంచి ఎంపీగా అభ్యర్థి ఎవరైనా నెగ్గుకు రాగలరనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీటు విషయంలో జగన్ తాపీగా కనిపిస్తున్నాడు. ఇక ఖరారు అయిన మిగిలిన సీట్ల విషయానికి వస్తే రాజమండ్రి నుంచి మార్గాని భరత్ రామ్, విశాఖపట్టణం నుంచి ఎంవీవీ సత్యనారాయణ, ఏలూరు నుంచి కోటగిరి శ్రీధర్,అమలాపురం నుంచి చింతా చంద్రవతి, నెల్లూరు నుంచి మేకపాటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.