కేంద్రంతో ఢీ అంటే ఢీ అని పోరాడుతున్నారు చంద్రబాబు. గడిచిన నాలుగేళ్ల కాలం కేంద్రంతో కలిసి మెలిసి తిరిగిన చంద్రబాబు.. అనూహ్యంగా కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నాను. నిజానికి ఆయన గతంలో చెప్పిన మాటలు తీసుకుంటే.. కేంద్రంతో తలపడితే.. ఉన్న అభివృద్ది కూడా పోతుందన్నారు. కేంద్రంతో గొడవ పడమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. వారిది ఆలోచన లేని వ్యాఖ్య.కేంద్రంతో పెట్టుకుంటే రాష్ట్రంలో ఈ మాత్రం అభివృద్ది కూడా జరగదు. అని చెప్పారు. కానీ, కేంద్రంతో తెగ తెంపులు చేసుకున్నారు. అయినా కూడా బాబు విజయం సాధిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాలుగున్నరేళ్లకిత్రం ఉన్న కష్టాలు ఇప్పుడు చాలావరకు తగ్గించామని... మరో నాలుగేళ్లలో అసలు కష్టాలే ఉండవని బాబుచెబుతున్నారు.
రాష్ట్ర పరిస్థితి, సాధించిన పురోగతిపై వరుస శ్వేత పత్రాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి ‘సుపరిపాలన’పై శ్వేతపత్రం విడుదల చేశారు. ‘‘నాలుగున్నరేళ్ల నిరంతర కష్టం, సమర్థ పాలనతో ముందుకు సాగుతున్నాం. విభజన కష్టాలను తట్టుకుని నిలదొక్కుకున్నాం. నిలబడటమే కాదు... చాలా అంశాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం’’ అని ప్రకటించారు. ఆర్థికలోటు తగ్గించగలిగామని తెలిపారు. ఇంకా ఆర్థిక సమస్యలున్నప్పటికీ తగిన పరిష్కారాలు ఆలోచించి, అమలు చేస్తున్నామన్నారు. విద్యుత్ చార్జీలను పెంచని, పెంచబోమని ప్రకటించిన ఏకైక రాష్ట్రం మనదేనని తెలిపారు. అయితే, కేంద్రం ఇస్తున్న విద్యుత్ రాయితీలతోనే దేశవ్యాప్తంగా విద్యుత్ రేట్లు పెరగలేదన్నది వాస్తవం. కానీ, చంద్రబాబు మాత్రం ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారు.
అదేసమయంలో.. రాష్ట్రంలో తాను ఉన్నాను కాబట్టే ఈ అభివృద్ధి సాధ్యమైందనే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ తనకు ఎందుకు ఓటు వేయాలో.. ఆయన చెబుతున్నారు. కానీ, వాస్తవానికి నాలుగు ఏళ్లలో కేంద్రంతో ఉంటేనే అభివృద్ది అని చెబుతున్న సీఎం.. ఇప్పుడు మాత్రం ప్లేట్ ఫిరాయించారు. ఈ నాలుగున్నరేళ్లలోనూ తాను కేంద్రంతో ఉన్నా జరిగింది శూన్యమని ఆయన ఒప్పుకున్నారు. అంటే.. కేవలం ఆరు మాసాల్లోనే అంటే కేంద్రంతో తాను విభేదించి బయటకు వచ్చాక మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకొని వస్తున్నారు అంటే.. ఆయన కేంద్రంపై గెలిచినట్టేగా? అంటున్నారు టీడీపీ నాయకులు. మరి ఇదే నిజమైతే.. కేంద్రంలో బాబు పొత్తులకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారో అర్ధం కావడం లేదనే వారికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఏం చెబుతారో చూడాలి.