ఆయన వల్ల వారానికో వివాదం.. ఆయన వల్ల రోజుకో ఫిర్యాదు.. మరి అలాంటి నాయకుడు అవసరమా? ఆయన వల్ల ఏంటి ప్రయోజనం? ఇలాం టి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి టీడీపీలో!! ఎన్నికలకు సమయంలో మించిపోతున్న సమయంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు గా కృషి చేయాల్సిన నాయకుడు.. సీనియర్ మోస్ట్.. ఇలా బజారున పడుతూ.. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా బజారున పడేస్తుంటే.. పార్టీలో కొనసా గించడం అవసరమా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనెవరు? అంటే.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గడిచిన నాలుగేళ్లలో ఆయన వల్ల పార్టీ ప్రయోజనం ఎక్కడా పొందిన దాఖాలా లేదు.పోనీ .. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రజలైనా ఆయన నుంచి లబ్ధి పొందారా? అంటే అదీ లేదు.
పైగా ఎన్నికైన వెంటనే ఆయన ఇసుక దందాల్లోకి వేలు పెట్టాడు.మహిళా అధికారిని తన్నించా డు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదం రేపింది. ఆ తర్వాత కూడా పద్ధతి మార్చుకోలేదు. అధికారులను అరెయ్.. ఒరెయ్ అంటున్నారంటూ.. రెవెన్యూ అధికారులు రోడ్డుకెక్కారు. ఇక, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు సాయంపై ఇంటికి వెళ్తే.. వారిని కూడా కులం పేరుతో దూషించారంటూ.. పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంది. ఇక, తనకు సంబంధం లేని పోస్టర్ వివాదంలోనూ వేలు పెట్టి ఆర్టీసీ ఉద్యోగులతో ఇష్టానుసారం వ్యవహరించాడు. ఇక, ఆయా ఘటనలపై సీఎం చంద్రబాబు పలు మార్లు వార్నింగులు ఇచ్చినా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా.. యూట్యూబ్ ఛానళ్లలో తనపై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నాడంటూ ఎమ్మెల్యే చింతమనేనిపై సినీ నటి అపూర్వ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది.
దీంతో ఇప్పుడు టీడీపీ పరువు పరాయి రాష్ట్రాల్లోనూ పోయే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి వారితో చంద్రబాబు ఇంకెన్నాళ్లు వేగుతారు. ఒకపక్క పార్టీలో రాజకీయ ఎమర్జెన్సీ అంటూ ప్రకటించారు. ఈ ఎమెర్జన్సీలోనే ఇలాంటి పనులు చేస్తుంటే.. ఎన్నికల సమయానికి పార్టీ పరువు ఏంకాను? ఏదేమైనా.. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు దానికి అనుగుణమైన సైన్యం కూడా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అనేది చంద్రబాబు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొందరు ఏం చేసినా.. కనీసం హెచ్చరికలతో సరిపెడుతూ.. మరికొందరిని మాత్రం టికెట్ ఇవ్వనని బెదిరింపులకు పాల్పడుతుంటే ఆయా నాయకుల్లో మనోస్థైర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వ్యూహమే కాదు.. కలుపు మొక్కల్ని కూడా ఏరేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు విశ్లేషకులు. మరి చంద్రబాబు ఆ దిశగా దృష్టి పెట్టకపోతే.. మొత్తానికే చేటు తేవడం ఖాయంగా కనిపిస్తోంది.