2019 జరగనున్న సారస్వత ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఏబిపి-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. ఈ సారి ఎన్డీఏ కు పార్లమెంట్ లో 291 ఎంపీ స్థానాలు దక్కనున్నాయని ఆ సర్వే తేల్చింది. అయితే ఉత్తర ప్రదేశ్ లో సమాజ్వాదీ బహుజన సమాజ్వాదీ పొత్తు గనక ఉంటే ఎన్డీఏకు వచ్చే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఈ సర్వే ప్రకటించింది. దీన్నిబట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బిజెపికి వయా లక్నో మాత్రమే. మోడీకి కేంద్రానికి మధ్యలో - ఎస్పి బిఎస్పి పొత్తు - ఒక అడ్డు తెర కానుందా? అన్నదే ప్రధాన సంశయం.
వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే పార్లమెంట్ కు ఎన్నికల ప్రక్రియ ముగిసి ప్రభుత్వం నెలకొనటం నిశ్చయం. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై ఏబిపి-సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ కు 291 సీట్లు వస్తాయని తేలింది. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఆ రాష్ట్రంలో ఎన్డీఏకు వచ్చే సీట్లు తగ్గే అవకాశం ఉందని సర్వే ప్రకటించింది. ఒకవేళ అదే జరిగితే ఏన్డీఏకు 247 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఆ సంస్థ ప్రకటించింది.
యూపీఏ కు మాత్రం వచ్చే ఎన్నికల్లో 171 సీట్లు మాత్రమే వస్తాయని సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎస్పీ - బీఎస్పీ పొత్తు ప్రభావం ఎన్డీఏ కూటమి పై పడితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొత్త మిత్రుల కోసం బీజేపీ వెతుక్కోవాల్సిన అనివార్య పరిస్థితులు లేకపోలేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయా లంటే 272 సీట్లు కావాలి. ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అను కూలంగా తీర్పు ఇస్తారని ఈ సర్వే తేల్చింది.
మధ్యప్రదేశ్ లో మొత్తం 29 లోక్-సభ స్థానాలు ఉంటే, బీజేపీ 23 స్థానాలను కైవసం చేసుకొంది. రాజస్థాన్లోని 25 సీట్లలో 19 సీట్లు ఛత్తీస్ఘడ్లో 11 సీట్లలో ఐదు స్థానాల ను గెలుచుకొ గలుగుతుందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది. బీహర్లోని 40 స్థానాల్లో ఏన్డీఏ 35 స్థానాలను గెలుచు కొంటుందని సీ ఓటర్ సర్వే ప్రకటించింది.బెంగాల్ రాష్ట్రంలో మాత్రం కేవలం 9 స్థానాలతోనే ఎన్డీఏ సరిపెట్టుకోవాల్సి వస్తోందని తేల్చి చెప్పింది. యూపీ లో ఎస్పీ,బిఎస్పీ పొత్తు పెట్టుకొంటే ఎన్డీఏ కు దెబ్బే నని సీ ఓటర్ తేల్చింది. ఏ పొత్తు లేకుండా విడి విడిగా పార్టీలు పోటీ చేస్తే ఎన్డీఏ కు యూపీలో 72 సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది.
దక్షిణ భారతంలో ఎన్డీఏ కు ఆశించిన సీట్లు దక్కవని ఈ సర్వే ధృడంగా ప్రకటించింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని 129 సీట్లలో కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ విజయం సాధిస్తోందని ఈ సర్వే ప్రకటించింది. ఏపీ లో ఓటర్లు టీడీపీ కి అనుకూలంగా తీర్పు ఇస్తారని ఈ సర్వే ప్రకటించింది. మరోవైపు తమిళ నాడు రాష్ట్రంలో డీఎంకె ఘన విజయం సాధించనుందని పేర్కొంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ఆశించిన స్థానాలు దక్కుతాయని, మహారాష్ట్రలో మాత్రం ఆ పార్టీ నష్ట పోయే అవకాశం ఉందని సీ- ఓటర్ సర్వే తేల్చింది.