జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ ఆరాటపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే కాంగ్రెస్తో దోస్తీ కట్టి ఆ కూటమిని జాతీయస్థాయిలో అధికారంలోకి తెస్తానని ధీమాగా అంటున్నారు. మరోవైపు కేసీఆర్.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కూడగడతానని దేశం మీదకు బయలుదేరారు.
ఇప్పటికే.. తెలంగాణలో ఎన్నికలు పూర్తి చేసుకున్న కేసీఆర్ ఈ విషయంలో చొరవ పెంచారు. ఇటీవలే ఆయన స్వయంగా ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశారు. చర్చలు జరిపారు. నవీన్ పట్నాయక్ కూడా తమది రాష్ట్రాల టీమ్ అని చెప్పుకొచ్చారు. కానీ ఆసంతోషం కేసీఆర్ కు 2 రోజులు కూడా మిగలలేదు.
తాజాగా ఒడిశా సీఎం బిజూ జనతాదళ్ తన ఎంపీని ఏపీకి పంపారు. వీరిద్దరూ అనేక అంశాలపై చర్చించినా ప్రధానంగా కూటమి అంశమే కీలకమని వార్తలు వస్తున్నాయి. నవీన్ పట్నాయక్ ఇప్పడు కాంగ్రెస్ కూటమిలో ఉంటారా.. లేక ఫెడరల్ ఫ్రంట్లో ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్తో దోస్తీ పట్ల చంద్రబాబు అపార్థం చేసుకోకుండా ఉండేందుకే.. తాము కాంగ్రెస్ కూటమి వైపే ఉంటామని సంకేతాలు ఇచ్చేందుకే నవీన్ పట్నాయక్ తమ ఎంపీని చంద్రబాబు వద్దకు పంపారని అమరావతి వర్గాలు భావిస్తున్నాయి. మరి అదే జరిగితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు ఆరంభంలోనే గండిపడ్డట్టవుతుంది.