సుమారు 14 నెలలుగా చేస్తున్న జగన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. జనవరి 8 న ఇచ్ఛాపురంలో జగన్ పాదయాత్ర ముగియనున్నది. ఆ తరువాత జగన్ కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా తో పాటుగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచు కొని కొత్త సంవత్సరంలో కదన రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ముగింపు ముహూర్తం ఖరారైంది.
గత ఏడాది నవంబర్ 6న ఇడుపుల పాయలో ప్రారంభ మైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర జనవరి 8న ఇచ్చాపురం లో ముగియనుంది. ఆ రోజు ఇచ్ఛాపురం లో భారీ బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్ర ముగింపుకు గుర్తుగా ఓ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. ఆ సభ ద్వారా జగన్ తన రాజకీయ భవిష్యత్ ను ప్రకటించే అవకాశం ఉంది. పాదయాత్ర ముగిసినా..ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో..ఆ వెంటనే అమలు చేయాల్సిన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. సంక్రాంతి అయిన వెంటనే బస్ యాత్ర ద్వారా పాదయాత్రలో వెళ్లలేకపోయిన నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు.
ఇందు కోసం రూట్ మ్యాప్ సిద్దం అవుతోంది. ఇదే సమయంలో..అభ్యర్ధుల ఎంపిక పైనా జగన్ ఓ అంచనా కు వచ్చినట్లు తెలుస్తోంది. పాదయాత్ర సమయంలోనే..జిల్లాల్లో తనకు ఎదురైన అనుభవాలు..అభ్యర్ధుల పనితీరు..ప్రజల అంచనాలు వంటి వాటి పై జగన్ పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇక, నియోజకవర్గాల వారీగానూ సర్వేలు చేయించారు. ఇప్పుడు వీటి ఆధారంగానే..సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసుకుంటూ అభ్యర్ధుల పై నిర్ణయం తీసుకోనున్నారు.