ఒక్కసారి మన దేశం గమనం పరికిస్తే మనం పురోగమించట్లేదని పైగా తిరోగమనాన్నే పురోగమనం అనుకుంటున్నామని అర్ధమౌతుంది. మనదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం అంటాము. ఇక్కడ మత కుల ప్రాతిపధిక పై ఏదీ జరగకూడదు. అర్ధిక రాజకీయ సామాజిక అసమానతలు ఏ విషయములోనూ చూపకూడదు. ఇదే ఇక్కడ పుట్టిన సామాన్యుని అవగాహన.
రాజ్యాంగం చెప్పిన విషయం ప్రకారం చూస్తే విద్యా సంస్థలలో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కులాల వారీ రిజర్వేషన్లు, ప్రజాప్రతినిధుల ఎంపిక కోసం కులాలకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు మన దేశంలో సహజం. ఈ రిజర్వేషన్ విధానం కులాల వారీగా జరగటం రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు.
కానీ రాజ్యాంగం మాత్రం మన దేశాన్ని లౌకిక రాజ్యమని చెప్పింది. ఏదైనా వెనుకబడిన లేదా అభివృద్ధికి నోచు కోని సామాజిక వర్గాలను, వెనుకబాటుతనం ప్రాతిపధికన బాధ్యత సంక్షేమం ప్రభుత్వం తీసుకుంటే అది అభినందనీయం. కాని దాన్ని చట్టం చేసి, తప్పని సరి చేసిన రాజ్యాంగం మనది. ఇక అదే రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా నిర్వచించటం ఎందులకు? ఇదీ సామాన్యుని ప్రశ్న.
పలానా కులానికి చెందిన వారే ఒక ఉద్యోగానికి అర్హులన్న నిబందన ఉందని ఎపుడైనా విన్నారా? కాని ఇది దారుణమైనా నిజం! ముమ్మాటికి నిజం ఇది సాధారణ ఉద్యోగ నియామకాలకు పెట్టిన నిబంధన కాదు. "రాష్ట్రపతి అంగరక్షకుడు" (బాడీగార్డ్) పదవికి లేదా ఉద్యోగానికి ఈ దేశంలో ఉన్న వేల కులాల వాళ్ళలోని కేవలం మూడు కులాల కు చెందిన వాళ్లే అర్హులట! ఆ కులాలే జాట్స్, రాజ్ పుత్స్, జాట్ సిక్కులు. ఈ మూడు కులాల వాళ్లే ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఈ విషయంపై ఇన్నాళ్ళకు మిగతా కులాలవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలే కాదు తాజాగా ఈ వ్యవహారంపై ఇన్నాళ్ళకు ఢిల్లీ హైకోర్టు సైతం మొట్టికాయలు వేసింది. 2017, సెప్టెంబరు 4 న ప్రెసిడెంట్ బాడీ గార్డు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. వాటికి మూడు కులాల వాళ్లే అర్హులన్న నిబంధనలను వ్యతిరేకిస్తూ హర్యానాకు చెందిన గౌరవ్ యాదవ్ న్యాయస్థానం తలుపుతట్టారు. యాదవ కులానికి చెందిన తాను, కులాన్ని తప్పిస్తే బాడీగార్డ్ పోస్టు కు అన్ని విధాలా తాను అర్హుడినని వాదించారు. ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయాలని అభ్యర్థించారు.
తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై విచారించిన జస్టిస్ మురళీధర్, జస్టిస్ సంజీవ్ నారులా నేతృత్వంలోని ధర్మపీఠం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్మీ స్టాఫ్ అధిపతికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను మే 8, 2019కి వాయిదావేసింది.
రాష్ట్రపతి బాడీగార్డులకు మూడు కులాల వాళ్లే అర్హులనడం రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో కుల వివక్ష ఉండకూడదని వాదించారు. కాగా, బాడీగార్డ్ ఉద్యోగ నియమాకాలపై మాత్రం ఢిల్లీ హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదు. తుదుపరి విచారణలో వచ్చే ఏడాది మేలో జరుగుతుంది.
ఒక తరహా ఉద్యోగాన్ని మూడుకులాలకు కేటాయిస్తే డిల్లీ ఉన్నత న్యాయస్థానం స్పందించింది. అలా కాకుండా ఏడు దశాబ్ధాలుగా కొంత శాతం ఉద్యోగాలు కొన్ని కులాలు రకరకాల పేర్లతో అనుభవిస్తూ రావటం న్యాయమా? అనేది విఙ్జులైన ప్రజల సమాధానం దశాబ్ధాలుగా దొరకని ప్రశ్న.