వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిని తూర్పారబట్టారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ద్వంద్వ శైలిని బట్టబయలు చేశారు. చంద్రబాబు ప్రచార పర్వం గురించి స్పందిస్తూ “1980-90 వార్తా పత్రికల్లో ఏది వచ్చినా ప్రజలు నిజమని నమ్మేవారు. తర్వాత మీడియా విస్తృతి పెరుగుతూ వచ్చింది. రకరకాల సమాచారం వస్తుంటే నిజమేదో-అబద్ధమేదో వారికి ఇట్టే తెలిసిపోతోంది. ప్రజలు అప్-డేట్ అయినా పాపం! బాబు ఆయన కుల మీడియా అప్-డేట్ కాకుండా ఇంకా తాము ఏ వార్త వదిలినా దానినే ప్రజలు విశ్వసిస్తారనే భ్రమలో ఉన్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చెప్పిన అంశాన్నిగుర్తుచేస్తూ విజయసాయిరెడ్డి చంద్రబాబు విధానాలను మరో ట్వీట్ లో బయటపెట్టారు. “కన్నా గారు చెప్పింది అక్షర సత్యం. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్మోహనరెడ్డి గారిపై ఏదో ఒక నేఱం మోపి మళ్లీ అరెస్టు చేయండని ఒత్తిడి చేశాడు ఈ దగాబాబు. రాష్ట్ర సమస్యలు-నిధులపై చర్చ లేదు. కాంగ్రెస్ అక్రమ కేసులు పెడితే తామెలా చేస్తామని కేంద్రం స్పష్టం చేసేసరికి కాంగ్రెసే నయమని అటువైపు జారిపోయాడు” అంటూ చంద్రబాబు తీరును బట్టబయలు చేశారు.
“బాహుబలిని వెన్నుపోటు పొడిచిన చంపిన ‘కట్టప్ప-కత్తి’...వెన్నుపోటు కు సింబల్. రాజకీయాలలో వెన్నుపోట్లకు చంద్రబాబు కట్టప్పకత్తినే వాడతారు. ఎన్టీఆర్ తో మొదలెట్టి నారా కట్టప్ప నాయుడి కత్తికి బలైపోయిన అనేక మంది. చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు జాబితా చాలా పెద్దదని టీడీపీ ఇప్పుడు సిసలైన “కట్టప్ప కత్తి పార్టీ” అంటూ చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు.
“వాస్తవిక స్థితికి అద్దం పట్టేది శ్వేతపత్రం. పచ్చి అబద్దాలు-అంకెల గారడీతో శ్వేతపత్రంకు ఉండే విశ్వసనీయతను భ్రష్టు పట్టించారు అంతర్జాతీయ అవార్డులతో సుపరి పాలనలో దేశానికే దిక్సూచి అయ్యామని చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టు కుంటారు. సామాన్యుల జీవన ప్రమాణాలు మాత్రం ఎప్పటికీ ఎండమావులే” అంటూ చంద్ర బాబు శ్వేతపత్రాల ఎపిసోడ్ ను ఎద్దేవా చేశారు.