చంద్రబాబునాయుడుకు ఉత్తర ప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పెద్ద షాకే ఇచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు
ప్రయత్నిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ కే తన మద్దతుంటుందని బహిరంగంగా
ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల మద్దతు కోసం
ఒకేసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్, చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న
సంగతి అందరికీ తెలిసిందే. జాతీయ స్ధాయిలో ఇద్దరు చంద్రులు చేస్తున్న ప్రయత్నాల
వల్ల ఒకరకంగా ఇద్దరి మధ్య పొటీని పెంచింది. అదే సమయంలో ఎవరి కెపాసిటీ ఏంటో
తెలిసిపోతుందనే రీతిలో ప్రచారం కూడా జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు ఎవరికివారుగా
తమ అధినేతే గొప్పంటూ ప్రకటనలు కూడా చేస్తున్నారు.
జాతీయ స్ధాయిలో మద్దతు కూడగట్టటంలో భాగంగా ఇద్దరు తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమిబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించారు. విచిత్రమేమిటంటే మద్దతు కోసం ఎవరికి వారుగా ఇద్దరూ ఒకరిని కలిసిన నేతలనే మరొకరు కలుస్తున్నారు. దాంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో జాతీయ పార్టీల అధినేతలకు, ముఖ్యమంత్రులకు కూడా ఇబ్బందిగానే మారింది. అందుకే తమ దగ్గరకు వచ్చిన ఇద్దరు సిఎంలను కాదనకుండా అందరూ కలుస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ ను కలవటానికి కెసియార్ ప్రయత్నించారు. కానీ వివిధ కారణాల వల్ల అఖిలేష్ ను కలవటం కెసియార్ కు సాధ్యం కాలేదు. అదే విషయమై అఖిలేష్ మాట్లాడుతూ, కెసియార్ ను కలవటం కుదరలేదని అందుకనే తానే హైదరాబాద్ కు వచ్చి కెసియార్ ను కలుస్తానంటూ చెప్పారు. అంతే కాకుండా కెసియార్ ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్ కు తన సంపూర్ణ మద్దతుంటుందని కూడా ప్రకటించారు. అఖిలేష్ చేసిన ప్రకటన ఒకరకంగా చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, చంద్రబాబు కలసిన వాళ్ళల్లో ఎవ్వరు కూడా చంద్రబాబుకు బహిరంగంగా తమ మద్దతు ప్రకటించలేదు.
ఎంతసేపు చంద్రబాబు వెళ్ళి జాతీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తాను మాత్రమే మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే, ఇఫ్పటి వరకూ చంద్రబాబు కలసిన మమతా బెనర్జీ, మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, కుమారస్వామి గౌడ, ములాయంసింగ్ యాదవ్ లాంటి వాళ్ళు ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీరిలో అవసరానికి ఒక్కోసారి కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకించే వారున్నారు. కాబట్టి వారిని బిజెపి వ్యతిరేక కూటమిలో చేరేట్లుగా చంద్రబాబు కొత్తగా ప్రయత్నం చేయాల్సిన పనిలేదు.
జాతీయ స్ధాయిలో ఏ కూటమితోను సంబంధాలు లేని ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఇద్దరు చంద్రుల్లో ఎవరికి మద్దతు ఇస్తారన్నదే కీలకం. నవీన్ ను మొన్ననే కెసియార్ కలిశారు. ఇంత వరకూ చంద్రబాబు కలిసినట్లు లేరు. కాబట్టి కెసియార్ కు మద్దతుగా అఖిలేష్ చేసిన ప్రకటన చంద్రబాబుకు మింగుడుపడనిదే. దానికితోడు నవీన్ పట్నాయక్ కూడా కెసియార్ కు మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు ప్రిస్టేజ్ అంతే సంగతులు.