ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒక పార్టీకి మాత్రమే అధ్యక్షుడు. ఇది పైకి కనిపిస్తున్న విషయం. రాష్ట్ర ప్రజ లు అంగీకరించే విషయం. కానీ, బాబును పరిశీలిస్తే.. మాత్రం.. ఇక్కడ మరో విషయం మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి పార్టీ కూడా ఆయన చెప్పినట్టే నడవాలనే సిద్ధాంతాన్ని చంద్రబాబు అలవరచుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో రెండు కీలక పార్టీలు ఉన్నాయి. జగన్ నేతృత్వంలోని వైసీపీ, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలు రెండూ కూడా వాటి పంథాలో అవిసాగుతున్నాయి. ఎవరి ఇష్టం వారిది! ఎవరి వ్యూహం వారిది! కానీ, చంద్రబాబు మాత్రం తన వ్యూహం ప్రకారమే ఆయా పార్టీలు నడుచుకోవాలనే తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
త్వరలోనే రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే, రా ష్ట్రానికి అన్యాయం చేసిన మోడీకి ప్రజలంతా నిరసన తెలిపి రాష్ట్ర కోసం పోరాడాలని చంద్రబాబు పిలుపు ఇవ్వాలని నిర్నయించుకున్నారు. పార్టీ అధినేతగా, సీఎంగా రాష్ట్రానికి పెద్దదిక్కుగా ఆయన ఈ పిలుపు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ, జనసేన, వైసీపీలు కూడా ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని, ఆయనకు నిరసన తెలపాలని కోరుతుండడం ఇప్పుడు ప్రధానంగా విస్మయానికి గురి చేస్తోంది. తాను నిరసన తెలిపితే.. తన వెంటే నడవాలని, తాను జై కొడితే.. తన తో పాటు జై కొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన పెద్దరికానికే మచ్చగా మారుతోంది.
మోడీ పర్యటనపై జగన్, పవన్ ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు. వైసీపీ, జనసేన ఎందుకు నిరసనలు చేయడం లేదని అన్నారు. నిజానికి ఏ పార్టీకి ఆ పార్టీకి సొంత అజెండా అంటూ ఉంటుంది. చంద్రబాబు అజెండాలను అమలు చేయాలని కోరడం, అలా చేయనివారిని రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేయడం అనేది బాబు నైజంగా మారింది.
నిజానికి తెలంగాణాలో పాగా వేయడం కోసం.. చంద్రబాబు కాంగ్రెస్తో సంబంధాలు పెట్టుకున్నారు.ఇదే పని ఇంకే పార్టీ అయినా చేసి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. ఏదేమైనా తాను వేసిన ఎత్తు ల ప్రకారం మిగిలిన పార్టీలను నడవమనే పరిస్థితి చంద్రబాబును చులకన చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయన చేయాలని అనుకుంటే.. ఏమైనా చేయొచ్చు. కానీ, ఇతరులు చేయడం లేదని చెప్పడం సరికాదు. తన రాజకీయాలు తన ఇష్టం. అదేవిధంగా ఏ పార్టీకి ఆ పార్టీ సొంతగా రాజకీయాలు చేస్తుంది. దీనిని ప్రశ్నించడం బాబుకు తగదని అంటున్నారు పరిశీలకులు.