టీవీ వీక్షకులకు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కొద్ది రోజులుగా టీవీ ఛానెల్స్కి సంబంధించి వస్తున్న పలు వార్తల వలన వీక్షకులు ఒకింత అసహానానికి, ఆందోళనకు గురయ్యారు. ఉన్నఫలంగా తమ బడ్జెట్ లో ఖర్చులు పెరిగిపోతున్నాయని..ఇలాంటి భారాన్ని తాము మోయలేమని వ్యతిరేకత తెలుపుతున్నారు. అయితే కేబుల్ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది.
వాస్తవానికి శుక్రవారం (28వ తేదీ) అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా డీటీహెచ్, కేబుల్ కనెక్షన్లు అన్నింటికీ ఈ విధానం అమలులోకి రావాల్సి ఉంది. అయితే, చాలా రాష్ట్రాల్లో వినియోగదారులు ఈ కొత్త విధానంలోకి మారడం ఆలస్యం కావడం నెలకొనడం.. ప్రజలు, ఆపరేటర్లు కూడా కొత్త పద్ధతిలోకి మారడానికి తగిన సమయం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) తన ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిసివేసింది.
పెరిగిన ధరల ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇతర ఛానళ్లు చూడాలకుంటే వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. దాంతో దేశ వ్యాప్తంగా వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు.
కాగా, వినియోగదారులు గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సబ్స్ర్కైబర్స్ అందరూ వారు ప్రస్తుతం వీక్షిస్తున్న పే చానళ్లను డిసెంబర్ 29వ తేదీ నుంచి కూడా ఎలాంటి అంతరాయం లేకుండా చూడగలగాలి అని బ్రాడ్కాస్టర్లు, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫాం ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది.
దీని ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన రీతిలో చానెళ్లను ఎంపిక చేసుకుని చెల్లింపులు చేసుకోవచ్చు. కేబుల్ ఆపరేటర్లు కూడా తమ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. ఆ ప్రణాళిక వెలువడేదాకా కేబుల్ టీవీ ప్రసారాల్లో అంతరాయం కలగకుండా, వినియోగదారులు అన్ని చానెళ్లూ చూడగలిగేట్లు చూడాలి అని ట్రాయ్ గురువారం నాడు వెలువరించిన ఓ ప్రకటనలో పేర్కొంది.