ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలు.. ఇది 1980 ల నాటి ప్రభుత్వ నినాదం.. ఆ తర్వాత అది కూడా మారింది. మేమిద్దరం.. మాకిద్దరు అనే నినాదం వచ్చింది. ఈ నినాదాలు ప్రజలపై బాగానే పనిచేశాయి. దీనికి తోడు జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించింది. అయితే ఇదంతా గతం.
ఇప్పుడు మళ్లీ ఎక్కువ మంది పిల్లలన్ని కనమని చెప్పే రోజులు వచ్చాయా.. ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలు ఇచ్చే రోజులు వస్తున్నాయా.. అవుననే అనిపిస్తోంది. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు ఓ ప్రకటన కూడా చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. జనాభాను పెంచండి అని ఆయన నినాదం ఇస్తున్నారు. అంతే కాదు.. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ఆయన ప్రోత్సహాకాలు కూడా ప్రకటిస్తామంటున్నారు.
ఈ మేరకు కొత్త జనాభా విధానాన్ని త్వరలో తీసుకువస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. చైనా, జపాన్, ఐరోపా వంటి దేశాల్లో జనాభా నియంత్రణ వల్ల యువకులు తగ్గిపోయారు. ఇప్పుడు వృద్ధులు ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చింది. సమాజంలో సమతుల్యత దెబ్బతింటోందని చంద్రబాబు అంటున్నారు. కానీ చంద్రబాబు ప్రకటనపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా చాలామంది ఇద్దరు పిల్లలకు పరిమితం అవుతున్నారు. మరికొందరు ఒక్కరితోనే సరిపుచ్చుకుంటున్నారు. ఒకరిద్దరికే విద్యా, ఉపాధి, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం తల్లిదండ్రులకు భారమవుతోంది. మరి ముగ్గురు, నలుగురిని కంటే ఆ భారం ప్రభుత్వం మోస్తుందా.. వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తారా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.