ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం అక్కడి నుంచి పార్టీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. గురువారం పార్టీ ఎంపీలకు ఢిల్లీ విందు ఇచ్చిన కేసీఆర్.. గత ఎన్నికల్లో బాగా పని చేయని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో ఈసారి మెజారిటీ స్థానాలు వస్తాయనుకున్నామని.. కానీ ఇద్దరు నేతలు ఒకరినొకరు ఓడించాలనుకుని పార్టీకి నష్టం చేకూర్చారని కేసీఆర్ కామెంట్ చేశారు. వారిద్దరి మధ్య గొడవలెలా ఉన్నా... ప్రభుత్వ పనితీరును చూసైనా ప్రజలు గెలిపిస్తారని అనుకున్నామనీ.. అదీ జరగలేదని ఆయన కామెంట్ చేశారట. పార్టీ అన్నాక ప్రాణం పెట్టి పనిచేయాలని.. స్వార్థం వీడాలని అన్నారు.
ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని .. దాని ప్రకారమే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వార్నింగ్తో ఖమ్మం జిల్లాకు చెందిన అగ్రనేతలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గత ఎన్నికల్లో తన వర్గానికి టిక్కెట్లు రాలేదని పొంగులేటి.. పార్టీకి సహకరించలేదని టాక్ వచ్చింది. తుమ్మల, పొంగులేటి ఆధిపత్యపోరు పార్టీకి నష్టం చేసిందని అంచనా.
ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. పొంగులేటి కూడా వచ్చే ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇస్తారో ఇవ్వరో అన్న ఆందోళనలో పడ్డారు. పార్టీకి నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న కేసీఆర్.. మరి ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.