గత కొంత కాలంగా భారత దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మహాత్మాగాంధీ అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచి వెళ్లిన రోజే దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. కానీ ఇప్పుడు పట్టపగలు మహిళలు ఒంటరిగా వెళితే భద్రత లేని పరిస్థితులు వచ్చాయి. ప్రజలు ఎన్నుకున్న ఓ నేత ప్రజలను కన్నబిడ్డాల్లా చూడాల్సిన నేత ఒక మైనర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించి..ఆమె మరణానికి కారణం అయ్యాడు.
వివరాల్లోకి వెళితే..2006లో రాజ్కుమార్ పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఇంట్లో 15 ఏళ్ల బాలిక పనిలో చేరింది..బాలికపై ఆ దుర్మార్గుడి కన్ను పడింది. ఓంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాధతో బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను తీసుకు పోవాల్సిందిగా కోరింది. ఇంతలో రాజ్కుమార్ స్నేహితుడు జయశంకర్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. కంగారుగా హస్పిటల్కు వెళ్లిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లే సరికిగా ఆమె మరణించింది.
అయితే బాలిక తల్లిదండ్రులకు రాజ్కుమార్ అనుమానం రావడంతో పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేయగా పోస్ట్మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. ఈ కేసు సీబీ-సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, సన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసును పెరంబలూరు కోర్టు నుంచి కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీల నేరాలను విచారించే ట్రయల్ కోర్టుకు బదిలీ చేశారు. చాలా కాలంగా విచారణ కొనసాగిన నేపథ్యంలో రాజ్కుమార్, ఆయనకు సహకరించిన స్నేహితుడు జయశంకర్ను దోషులుగా నిర్థారించిన కోర్టు వారిద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.42 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.