దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి రంగం సిద్ధమవుతోంది. ఓవైపు రాఫెల్ దుమారం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెడుతుంటే కేంద్రం అగస్టా కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన క్రిస్టియన్ మైఖేల్.. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీ పేర్లు వెల్లడించారు.
వీవీఐపీ హెలికాప్టర్లయి అగస్టాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఈ కేసు నమోదైంది. ఈ హెలికాప్టర్లను భారత్ కు అమ్మించిన దళారీ క్రిస్టియన్ మైకేల్. యూఏఈలో తలదాచుకున్న మైకేల్ ను ఇటీవలే భారత దేశం రప్పించుకుంది. ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అతడిని విచారిస్తోంది.
ఈ కేసు విచారణలో భాగంగా మైకేల్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు వెల్లడించారని ఈడీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీని మైకేల్.. ఇటాలియన్ మహిళ కొడుకు అని తన విచారణ సమయంలో వెల్లడించాడట. అలాగే ఈదేశానికి కాబోయే ప్రధానమంత్రిగా చెప్పబడుతున్న యువకుడు అని ప్రస్తావించాడట.
ఈడీ న్యాయవాది వాదనలు విన్న పాటియాలా కోర్టు మైకేల్ ను వారం రోజులపాటు కస్టడీకి విధించింది. విచారణ సమయంలో కచ్చితంగా సమయపాలన విధించాలని తెలిపింది. అసలే సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అగస్టా కేసులో సోనియా, రాహుల్ పేర్లు బయటకు రావడం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టే పరిణామమే. బీజేపీ ఈ ఇష్యూను తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం పుష్కలంగా ఉంది.