కంచే చేను మేస్తే కాచేదెవరన్నట్టు తయారైంది ఢిల్లీలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న ఆడపిల్లల పరిస్థితి. దిక్కూమొక్కూ లేక అనాధలుగా మారిన వారిపై కరుణ చూపించాల్సిన ఆశ్రమం మహిళా సిబ్బందే రాక్షసుల్లా తయారయ్యారు. ఆడపిల్లల పాలిట అకృత్యాలకు ఒడిగట్టారు.
ఇటీవల ఆశ్రమాల్లోనూ, అనాథ శరణాలయాల్లోనూ ఇలాంటి అకృత్యాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ తరచూ ఇలాంటి సదనాలను తనిఖీ చేస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగా ఢిల్లీలోని ద్వారకానగర్లోని ఓ ఆశ్రమంలో ఈ దారుణాలు వెలుగు చూశాయి.
ఇక్కడి మహిళా సిబ్బంది ఆడపిల్లలు ఏ చిన్న తప్పు చేసినా ఘోరమైన శిక్షలు వేస్తూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. ఆడపిల్లల జననావయాల్లో కారం పెడుతూ హింసిస్తున్న సంగతి మహిళాకమిషన్ తనిఖీల్లో బయటపడింది. ఈ ఆశ్రమంలోని టీనేజీ పిల్లలతోనే వంట నుంచి గదులు శుభ్రం చేయడంవరకూ అన్ని పనులూ చేయిస్తున్నారు.
పని చేయనని ఎదురు తిరిగితే దారుణంగా కొడుతున్నారని ఆడపిల్లలు చెప్పారు. కొట్టినా మాట వినని ఆడపిల్లల మర్మావయవాల్లో కారం పెట్టి మరీ హింసిస్తున్నారని వారు కన్నీళ్లతో మహిళాకమిషన్ సభ్యులకు వివరించారు. ఆశ్రమం సిబ్బంది తీరుపై మండిపడిన మహిళాకమిషన్ ఛైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.