చంద్రబాబైనా ఆ చంద్రశేఖరుడైనా మాటల్లో తొందరపాటు తగ్గించుకోకపోతే ఆ తొందరలో దొర్లే మాటలు కొంప ముంచేస్తాయి. ఒక్క చంద్రబాబు నోరు జారుడు దాదాపు ఎనిమిది లక్షల కులజనుల ఆగ్రహానికి బలైపోతున్నాయి నిఖార్సుగా! నాయకుల వ్యాఖ్యల్లో కులాల గురించి ఏమాత్రం తేడా మాటలు దొర్లినా ఆయా కులసంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ సెగ తగులుతోంది.
కేసీఆర్పై రాజకీయ విమర్శల కోసం తమ కులాన్ని కించపరుస్తారా? అని భట్రాజు కుల సంఘాలు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యల ను తాము ఖండిస్తు న్నామని ఏపీ భట్రాజుల సంఘం మహిళా అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
చంద్రబాబు వ్యాఖ్యలు యావత్ భట్రాజుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని చంద్రకళ అన్నారు.ఆత్మగౌరవంతో విద్యను అమ్ముకుని బతికే మమ్మల్ని అవమాన పరుస్తారా? అని ప్రశ్నించారు. బాబు వెంటనే భేషరతుగా భట్రాజులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏపీలో ఉన్న 8 లక్షల మంది భట్రాజులంతా ఏకమవుతారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ది చెబుతారని హెచ్చరించారు.
భట్రాజుల సంక్షేమానికి ఏమాత్రం సహకరించరు గానీ అనవసరంగా తమపై నోరు పారేసుకుంటున్నారని చంద్రకళ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గద్దర్ ఇలాగే మాట దొర్లారని, అయితే తర్వాత క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. త్వరలోనే కేసీఆర్ ను కూడా కలిసి దీనిపై మాట్లాడు తామని చెప్పారు. భట్రాజులు, బీసీలు కలిసి ఏపీలో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు.
కాగా, గత శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో చంద్రబాబు కేసీఆర్ను విమర్శించడానికి భట్రాజు కులప్రస్తావన తెచ్చారు. ఒకప్పుడు భట్రాజులా నన్ను పొడిగి ఇప్పుడు మళ్లీ నువ్వే విమర్శిస్తున్నావా? అని ప్రశ్నించారు. దీంతో భట్రాజుల మనోభావాలను దెబ్బతీశారని ఆ కుల సంఘం వారు ఆరోపిస్తున్నారు.