దేశంలో రోజు రోజుకీ మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి.  ప్రభుత్వంలు ఇలాంటి నేరస్థుల పట్ల ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అవి కఠినంగా ఉండకపోవడంతో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ దారుణాలు జరుగుతున్నాయి. భారత దేశంలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజధాని ఢిల్లీ లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ ఇలాంటి అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు.

తాజాగా ఓ మహిళ తనకు వార్నింగ్ ఇచ్చిందన్న కక్ష్యతో ఓ యువకుడు మహిళను నగ్నంగా పరిగెత్తించాడు. ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడిచేసి, వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లా గోపీగంజ్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..శనివారం సాయంత్రం ఓ మహిళ బజారు నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు.  అతడి వెకి చేష్టలకు ఆ మహిళ  ధైర్యంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అవమానభారంతో అక్కడి నుంచి వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పి అదును చూసి ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. ఆ మహిళ భయంతో రోడ్డు పై పరుగులు తీస్తుంటే రక్షించాల్సిన యువకులు ఫోటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు.  బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: