ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై యూపీ మంత్రి సతీశ్ మహనా ప్రశంసల వర్షం కురిపించారట. పరిపాలనలో ఆయనే తనకు రోల్ మోడల్ అంటూ తెగ మెచ్చేసుకున్నారట. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చంద్రబాబే తనకు స్పూర్తి" అంటూ చంద్రబాబునాయుడును ప్రశంసలతో ముంచెత్తారట. ఆయన అమరావతి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ప్రజలకు సేవ చేయాలన్న తపనతో నిరంతరం విశ్రమించని నేత మీరని ఆయన చంద్రబాబుతో అన్నారట. పాలన ద్వారా అనునిత్యం ప్రజలకు మంచి చేయడానికి మీరు పడుతున్న తపన ఆదర్శనీయమని చెప్పుకొచ్చారు. ఆనాడు మీరు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని స్పూర్తిగా తీసుకునే తాను గతంలో యూపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశానని సతీశ్ గుర్తు చేసుకున్నారట.
చంద్రబాబు హయాంలో రాష్ట్రాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో సాధిస్తున్న విధానంతో మిమ్మలను సీఈవొ అని ముద్దుగా పిలుచుకునే వారమని సతీశ్ మహనా స్మరించుకున్నారని తెలుగు దేశం వర్గాలు చెబుతున్నాయి. ఇంతకూ ఆయన అమరావతి ఎందుకు వచ్చారో చెప్పలేదు కదా..
ఉత్తర ప్రదేశ్ లో జనవరి 15 నుంచి ప్రయాగలో అర్థ కుంభమేళ జరగనుంది. దీనికి దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు యూపీ తరపున ఆయన వచ్చారు. వారణాసిలో జనవరి 21 నుంచి 3 రోజులపాటు జరిగే ప్రవాస భారతి దినోత్సవానికి కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారట.