విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్
రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటకి హత్యాయత్నమే అంటూ విశాఖపట్నం పోలీసు కమీషనర్ మహేష్
చంద్ర లడ్డా ప్రకటించారు. ఇంతకాలం ఈ విషయమై ఎటువంటి ప్రకటన చేయని పోలీసు కమీషనర్
హఠాత్తుగా జగన్ పై దాడిని హత్యాయత్నం క్రిందే నిర్ధారించటం చంద్రబాబునాయుడుకు షాక్
ఇచ్చేదనటంలో సందేహం లేదు. ఎందుకంటే, ప్రచారం, సింపతీ కోసం జగనే తనపై తానే దాడి
చేయించుకుని హత్యాయత్నం నాటకమాడుతున్నట్లు ఎగతాళి చేసిన విషయం అందరూ చూసిందే. దానికి
తోడు హత్యాయత్నం జరిగిన వెంటనే డిజిపి ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ జగన్ పై దాడి
ప్రచారం కోసమే జరిగిందంటూ తేల్చేశారు.
జగన్ పై దాడిని వీలైనంతగా తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడింది. అంతేకాకుండా విచారణ నిమ్మితం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, సిట్ విచారణపై నమ్మకం లేక జగన్ థర్డ్ పార్టీ విచారణ కోరటం, కేసును హై కోర్టు విచారిస్తున్న విషయం అంతా తెలిసిందే. కేసు ఈనెల 4వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపధ్యంలోనే లడ్డా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ అక్టోబర్ 18వ తేదీన జగన్ పై దాడి చేయటానికి ప్లాన్ చేసుకున్నట్లు చెప్పటం గమనార్హం. అయితే, 18వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుండి హైదరాబాద్ కు రావాల్సిన జగన్ ముందురోజు అంటే అక్టోబర్ 17వ తేదీనే విమానంలో హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్లాన్ అమలు చేయలేకపోయినట్లు చెప్పారు.
ముందు రోజు ప్లాన్ ఫెయిల్ అయిన కారణంగానే పక్కాగా అక్బోబర్ 23వ తేదీన నిందితుడు శ్రీనివాస్ అమలు చేసినట్లు లడ్డా అభిప్రాయపడ్డారు. జగన్ ను హత్య చేసేందుకే రెండుసార్లు కత్తికి పదును పెట్టించినట్లు కూడా లడ్డా చెప్పటం విశేషం. ఒకవైపు చంద్రబాబు, మంత్రులు, డిజిపిలేమో జరిగిన దాడి అంతా నాటకమని ఇప్పటికీ చెబుతున్నారు. అదే సమయంలో విశాఖపట్నం కమీషనర్ మాత్రం జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని నిర్ధారించటం ఆశ్చర్యంగా ఉంది.