ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, వైసీపీ, జనసేన ముక్కోణపు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషణలు కూడా పదునెక్కుతున్నాయి. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి.. ఎవరు ఎలాంటి స్ట్రేటజీతో వెళ్తున్నారు. ఎవరికి ప్లస్,మైనస్ ఏంటన్న చర్చ జోరుగా మొదలైంది.
జగన్ విషయానికి వస్తే.. రాజధాని అమరావతి విషయంలో ఆయన వేసిన స్టెప్ అతిపెద్ద పొలిటికల్ మిస్టేక్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రవాసులందరి కలగా మారింది. అది సహజం. అది ఒక విధంగా చంద్రబాబుకు కలసివచ్చిన అంశం.
కానీ జగన్ మాత్రం.. అమరావతి నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చారు. రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు కానీ.. ఇతర కార్యక్రమాలకు కానీ ఆయన అస్సలు హాజరుకాలేదు. పైగా.. అమరావతి ప్రాంత రైతుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు పార్టీ ద్వారా ప్రయత్నించారు.
అమరావతి పట్ల జగన్ వైఖరి రాజకీయంగా ఆయనకు నష్టం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు హాజరవుతూనే ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి ఉంటే ప్రజల మద్దతు పొందే అవకాశం ఉండేదని గుర్తు చేస్తున్నారు. మరి ఈ అంశం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.