షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న
కొద్దీ చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. జనసేనకు ఎవరితోను పొత్తు వద్దని పవన్ కల్యాణ్
స్పష్టంగా చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ చంద్రబాబుకు ఎందుకు గోకుతున్నారు ?
ఎందుకంటే, రేపటి ఎన్నికల్లో ఎలా
గెలవాలన్నదే చంద్రబాబు ముందున్న ప్రధాన లక్ష్యం. టార్గెట్ కరెక్టుగానే ఉన్నా
దాన్ని రీచయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు లేదు. దానికితోడు జగన్, పవన్ ఎక్కడ
పొత్తు పెట్టుకుంటారో అనే టెన్షన్ బాగా పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబు ముందున్న
సమస్య ఏమిటంటే, ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కోలేరు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం
మనస్పూర్తిగా ఇష్టం ఉన్నట్లు లేదు. అందుకు ఏం చేయాలో తెలీకే టెన్షన్
పెరిగిపోతోంది.
తెలంగాణా కాంగ్రెస్ తో పొత్తు వర్కవుట్ అయ్యుంటే ఈ పాటికి చంద్రబాబులో ఆ ఊపు వేరేగా ఉండేది. కానీ తెలంగాణా ఎన్నికల్లో తల బొప్పి కట్టేసరికి కాంగ్రెస్ లో పొత్తుల విషయంలో ఏం చేయాలో అర్ధం కావటం లేదు. కాపులను బిసిల్లో కలుపుతానని పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని ఎంత సవ్యంగా అమలు చేసింది అందరూ చూశారు.
చంద్రబాబు చేసిన పనితో రాజకీయాలకు సంబంధం లేని కాపుల్లో ఎక్కువ మంది ప్రభుత్వంపై మండిపోతున్నారు. కాపు సామాజికవర్గాలతో జరిపిన సమావేశాల్లో మెజారిటీ కాపుల మనోగతాన్ని పవన్ కల్యాణ్ కూడా గ్రహించారట. అందుకే పవన్ ముందున్న మార్గాలు రెండే అని సమాచారం. మొదటిది ఒంటరిగా పోటీ చేయటం. రెండోది జగన్ తో పొత్తు పెట్టుకోవటం. ఈ రెండు మార్గాల్లో దేనిని ఎంచుకున్నా పవన్ కు ఇబ్బంది ఉండదని కాపు నేతలు చెబుతున్నారు.
ఒంటిరిగా పోటీ చేస్తే జనసేనకు మహా అయితే ఓ 15 సీట్లు రావచ్చని కాపు నేతల అంచనా. అదే జగన్ తో పొత్తు పెట్టుకుంటే ఇంకో ఐదు సీట్లు అదనంగా రావచ్చని అంచనా వేస్తున్నారు.అంటే పవన్ ఒంటరిగా పోటీ చేసినా జగన్ తో జట్టు కట్టినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని తేలిపోయింది. అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే మాత్రం దారుణ పరిస్దితులు తప్పవని కాపు నేతలు చెప్పారట పవన్ తో.
జగన్ తో పొత్తు పెట్టుకోవటం వల్ల పవన్ కు పెద్దగా ఉపయోగం లేకపోయినా తెలుగుదేశంపార్టీ మీద మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. జగన్ పాదయాత్రలో జనాల నుండి విశేష స్పందన కనిపిస్తోంది. సానుకూలంగా స్పందిస్తున్న జనాల్లో సామాజికవర్గాల సమస్య లేకపోయినా ప్రత్యేకించి కాపుల స్పందన ఎలా ఉంటుందో అన్నదే కీలక అంశంగా మారుతోంది. రేపటి ఎన్నికల్లో కాపులు చంద్రబాబునే సమర్ధిస్తారా ? జగన్ కు మద్దతుగా నిలబడేది ఎంతమంది ? పవన్ విషయంలో ఎలా స్పందిస్తారన్న విషయంలో ఎవరికి కూడా క్లారిటీ లేదు.
కాపుల మద్దతు విషయమే ఎందుకింత కీలకమైందంటే ఉభయ గోదావరి జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారి ప్రభావం గణనీయంగా ఉంటుంది కాబట్టే. వచ్చే ఎన్నికల్లో కాపుల మద్దతు ఎవరికి ఎక్కువగా దక్కితే వారే గెలుపుకు దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది.