వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మరో మలుపు తిరిగింది. జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 25వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. అయితే ఇప్పటివరకూ ఈ కేసు వాదనలు విన్న జడ్జి వెంకటరమణ బదిలీ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది.
వైసీపీ అధినేత జగన్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సీబీఐ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో సరికొత్త ట్విస్ట్ ఏర్పడింది. ఇంతకాలం ఈ కేసు వాదనలు విన్న జడ్జి వెంకటరణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో కొత్త జడ్జి రావాల్సి ఉంది. అప్పటి వరకూ ఈ కేసు విచారణ కొత్త జడ్జి వచ్చే వరకూ ఆగిపోనుంది.
కొత్త జడ్జి రావాల్సి ఉండడం, కోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ కేసు విచారణలో జాప్యం జరిగే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. జడ్జి నియామకం జరిగిన తర్వాత ఈ కేసుపై పూర్తిగా స్టడీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన వాదనలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. సుమారు వంద గంటలకుపైగా ఇప్పటివరకూ ఈ కేసులో వాదనలు జరిగాయి. వీటన్నింటినీ కొత్త జడ్జి స్టడీ చేయాల్సి ఉంటుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఇప్పటివరకూ 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇప్పటివరకూ నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి తదితరులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. తమపై అక్రమంగా కేసులు బనాయించారంటూ వాదనలు వినిపించారు. ఇప్పటికైనా తమపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.లను, ఛార్జ్ షీట్లను తొలగించాలని పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం 11 కేసుల్లో ఇప్పటివరకూ 4 కేసుల విచారణ జరిగింది. వీటికి సుమారు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇంతకాలం ఈ కేసులను విచారించిన జడ్జి ఇప్పుడు బదిలీ అయ్యారు. కొత్త జడ్జి నియామకం జరగాల్సి ఉంది. దీంతో మళ్లీ విచారణ జరగాల్సి ఉంది.
పైగా.. మొత్తం కేసులన్నింటిని విచారణ జరిపిన తర్వాత తీర్పు ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. విడివిడిగా ఒక్కో ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన తర్వాత తీర్పు చెప్తే.. అది మిగిలిన కేసులపై కూడా ప్రభావం చూపుతుందని సీబీఐ వాదించింది. దీంతో మొత్తం అన్ని డిశార్జ్ పిటిషన్లను మొదటి నుంచి మళ్లీ వినాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తీర్పు రానుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మరికొన్నేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.
వీలైనంత త్వరగా ఈ కేసుల నుంచి బయటపడితే బాగుంటుందని జగన్ భావిస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికి రావడం ఒక విధంగా ఇబ్బంది కలిగించే అంశమే.! ఎన్నికలు సమీపిస్తుండడం, త్వరగా క్లీన్ చిట్ లభించి బయటికొస్తే మచ్చలేని వ్యక్తిగా ఎన్నికల గోదాలోకి దిగాలనుకుంటుండడంతో జగన్ కు ఈ అంశం కాస్త ఇబ్బంది కలిగించేదే..!