వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని వైసీపీ గట్టిగానే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ అలుపెరగని పాదయాత్రను చేపట్టి తొందరలోనే ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకోబోతున్నారు. ఇంకోవైపు అభ్యర్ధులను కూడా ఖరారు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. ఇక బస్సు యాత్రను కూడా జగన్ నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ రాజకీయం వేడెక్కనుంది. మిగిలిన పార్టీల మాటెలా ఉన్న వైసీపీ మాత్రం ఒకే లక్ష్యంతో ఒకే వ్యూహంతో ముందుకు సాగడం ఇక్కడ విశేషం.
క్యూ కడుతున్నారు :
ఇదిలా ఉండగా వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ లేటెస్ట్ గా ఓ బాంబు పేల్చారు. త్వరలోనే వైసీపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. తమ పార్టీలోకి రావాలని చాలామంది పెద్ద తలకాయలు రెడీగా ఉన్నారని ఆయన గుట్టు బయట పెట్టారు. వారు ఎవరన్న విషయం తొందరలోనే తెలుస్తుందని ఆయన కామెంట్స్ చేశారు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మళ్ళీ ఈ వైపుగా మళ్ళుతోంది. ఎవరు వైసీపీలోకి వెళ్తారు. అధికార పార్టీ నుంచి ఎవరెవరు వస్తున్నారు, వారి పేర్లేమింటన్న దానిపైన ఇపుడు హాట్ హాట్ చర్చ సాగుతోంది.
గొడ దూకుళ్ళు మొదలా :
నిజానికి టీడీపీలో చాలామంది అసంత్రుప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అధికారం ఉంది కదా అని ఇన్నాళ్ళు అట్టిపెట్టుకుని ఉన్నవాళ్ళు అనేకమంది ఉన్నారు. గతంలోనే పెద్ద సంఖ్యలో అధికార పార్టీ నుంచి వైసీపీలోకి ఫిరాయింపులు ఉంటాయని వార్తలు వచ్చాయి. అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందామన్న ఆలోచనతోనే చాలామంది ఉండిపోయారప్పట్లో. ఇపుదు ఎటూ ఎన్నికల్ సీజన్ వచ్చేసింది. ఇక జగన్ సైతం అభ్యర్ధులను డిసైడ్ చేసే పనిలో పడ్డారు. అందువల్ల గోడ దూకుళ్ళు భారీగానే ఉంటాయని బొత్స మాటలను బట్టి అర్ధం అవుతోంది.
వందరోజులేనట :
ఇక బాబు సర్కార్ కి కౌంట్ డౌన్ మొదలైందని కూడా బొత్స పేర్కొనడం విశేషం. ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చంద్రబాబు కళ్ళారా చూస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పు టీడీపీకి సరైన గుణపాఠం అవుతుందని కూడా బొత్స అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేది తమ సర్కారేనని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని జనం మార్పు కోరుకుంటున్న సంగతి తమకు బాగా తెలుస్తోందని కూడా ఆయన అనడం గమరార్హం.