"అసలే కోతి, కల్లు తాగింది, ఆపై నిప్పు తొక్కింది" ఆ తరవాత అది చేసే అల్లకల్లోలం అంతా ఇంతాకాదు. ప్రజల పట్ల బాధ్యత లేని వాళ్ళకు అధికారం ఇస్తే ఇలాగే తగలడతది. ఈ మద్య నాయకులు మాట్లాడు కోవటం మానేశారు. పోట్లాడు కోవటం మొదలెట్టేశారు. ఆపై తిట్టు కోవటంలో డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ తప్పితే అందరూ అంతే. భారతీయ జనతా పార్టీ పై తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బాబూ రాజేంద్రప్రసాద్ పైన చెప్పుకున్నట్లు విరుచుకు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా తామే చేశామని బీజేపీ అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు ఇద్దరూ పవర్ బ్రోకర్స్ అంటూ మండిపడ్డారు.
వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి యూసీలు (నిధుల వినియోగ ధృవీకరణ పత్రాలు) ఇవ్వలేదంటూ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థనరెడ్డి చేస్తున్న ఆరోపణలు నిజంకావని చెపుతూ వెనుకబడిన ప్రాంతాల నిధులకు సంబంధించి తాము ఎన్నోసార్లు యూసీలు ఇచ్చామని అవసరమైతే ఆధారాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. యూసీలు ఇచ్చినట్లు నీతి ఆయోగ్ కూడా స్పష్టం చేసిందని అలాగే ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేసిన విషయం గుర్తు లేదా? అని విమర్శించారు. అసత్యాలు చెప్పిన విష్ణువర్థనరెడ్డి వెంటనే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ వీధి నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఒక బజారు మనిషి మాట్లాడే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దేశవ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రధాని నరేంద్ర మోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. ఏపీలో బీజేపీ నాయకులను చంద్రబాబు నాయుడు పాలు పోసి పెంచారని ఇప్పుడు వాళ్లు అడ్డుకుంటారా? అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే బీజేపీ నేతలు ఇళ్లలోంచి బయట కు రాగలరా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల్లారా ఖబడ్డార్! అంటూ హెచ్చరించారు. జాగ్రత్తగా మాట్లాడాలని లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కనుసైగ చెస్తే ప్రజలు ప్రతిపక్షాలు తల్లకిందులౌతాయని ప్రజలకు ఇప్పటికే తెలుసు. 2019 ప్రధమార్ధంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కనుసైగ చేయటానికి సిద్ధంగా ఉన్నారు. పనికిమాలిన వాళ్లను ఏరేయటం ఈ సారి తధ్యం. దేశ ప్రధాని దేశానికి ప్రతినిధ్యం వహిస్తారు. ఆయన ఏమీ అన్-పార్లమెంటరీగా మాట్లాడలేదే! ఆయన్ని అనవసర విమర్శలు, అదీ కనీసం ప్రజలు ఎన్నుకోబడని ఒక శాసనమండలి సభ్యుడైన బాబూ రాజెంద్ర ప్రసాద్ విమర్శించటం జాతికి గౌరవం ఆపాదించదు అంటున్నారు సాధారణ జనం. అంతేకాదు ఈ మద్య చంద్రబాబు దృష్టిలో పడటానికి ఆయన ఆదరణకు నోచుకోవటానికి మంత్రిమండలిలోని ప్రతిసభ్యుడు నుండి మొదలుపెట్టి సాధారణ కార్యకర్తవరకు తమెవరి గురించి మాట్లాడుతున్నామో సోయిలేకుండా మాట్లాడటం టిడిపికి చేటు తెచ్చుకోవటమే అన్న విషయం మరచిపోతున్నారు.
నిన్న ముఖ్యమంత్రి కాకినాడలో నరేంద్రమోడీపై తన కున్న ఆగ్రహం, ఒక సాధారణ బిజేపి కార్పోరేటర్ పై (కార్యకర్త కూడా కావచ్చు) అదీ ఒక మహిళపై ప్రదర్శించిన తీరు కించపరచి బెదిరించిన విధానం చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతల నియంతృత్వంలో నలిగిపోతున్నమా? అనిపిస్తుంది. అలాంటి చంద్రబాబు కనుసైగ చేస్తే జరిగే అరాచకం జనాలకి తెలుసు. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం పై ప్రభుత్వం డీల్ చేసిన పద్దతే చెపుతుంది ఎలాంటి ప్రభుత్వమో మనదనేది? చివరకు హైకోర్ట్ కేసును NIA కి ఒప్పగించినా తిట్లు భారత ప్రధానికే! ఇదీ మన పాలకుల సంస్కారం.
ప్రజలు రాష్ట్ర పాలనకు టిడిపికి అధికారమిస్తే రాష్ట్ర పాలన వదిలేసి ప్రతిపక్ష ఎమెల్యేలను ప్రలోభాలకు గురిచేసి గోడ దూకించి, ప్రతిపక్ష నాయకుని అవినీతి కేసులపై శాసనసభలో చర్చల తో, విమర్శలతో, తిట్లు, శాపనార్ధాలతో నాలుగున్నరేళ్లు కాలయాపన చేసి కాలం గడిపిన అధికార పార్టీని ప్రజలు తుంగలో తొక్కే తరుణాన - అధికార పార్టీ గల్లి నాయకుడు మొదలుకొని డిల్లి నాయకుల వరకు ప్రతి ఒక్కరి మదిలో చెలరేగే నిరాశ , నిస్పృహ, నిట్టుర్పు, మనోవేదనల ప్రదర్శన .... వీళ్ళను ఓడి పోబోతున్నారనేది నిర్ణయమైందని ప్రజలకు అర్ధమౌతూనే ఉంది.