చంద్రబాబునాయుడు, నరేంద్రమోడిలు ఒకటే
అనే వైసిపి నేతల ఆరోపణలకు తాజాగా మరో సాక్ష్యం బయటపడింది. చంద్రబాబు తమకు శాస్వత
మిత్రుడన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాటలు నిజమే అనేందుకు తాజాగా ఓ
రుజువు బయటపడింది. చంద్రబాబు దావోస్ పర్యటనపై తీవ్రమైన ఆంక్షలు విధించిన కేంద్రం
కొద్ది గంటల్లోనే ఆంక్షలను ఉపసంహంరించుకోవటమే అందుకు నిదర్శనం. ఇంతకీ విషయం
ఏమిటంటే, ప్రతీ ఏడాది వెళ్ళినట్లు చంద్రబాబు భారీ బృందంతో దావోస్ లో జరిగే
అంతర్జాతీయ ఆర్దిక సదస్సుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందుకు వారం రోజుల
పర్యటనలో సుమారు 17 మంది బృందంతో వెళుతున్నట్లు, అందుకు అనుమతి ఇవ్వాలంటూ
కేంద్రానికి లేఖ రాశారు.
అయితే, దావోస్ కు అంత పెద్ద బృందం అవసరం లేదని, పర్యటన కూడా వారం రోజులు కాకుండా నాలుగు రోజులకు కుదించుకోవాలని కేంద్రం ఆంక్షలు విధించింది. తన పర్యటనపై కేంద్రం విధించిన ఆంక్షలతో చంద్రబాబు మండిపోయారు. చంద్రబాబు పర్యటనపై కేంద్రం ఆంక్షలు విధించటం ఇదే మొదటిసారి. అందులోను ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వెళ్ళే చివరి పర్యటన కావచ్చు. అందుకే చంద్రబాబు ఈ పర్యటనను ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. అందుకే వెంటనే ఆంక్షలు విధించిన కేంద్రంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఆంక్షలు లేని అనుమతి కోసం మళ్ళీ లేఖ రాయాలని ఉన్నతాధికారులకు పురమాయించారు. అదే సమయంలో కేంద్రంలోని ముఖ్యులతో చంద్రబాబు కూడా ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.
ఇంకేముంది ? ఆంక్షలు విధించిన కొద్ది గంటల్లోనే కేంద్రం ఉపసంహరించుకుంది. రెండోసారి అనుమతి కోరుతు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఫైలుకు చంద్రబాబు కోరుకుంటున్నట్లే అనుమతులు మంజూరైపోయాయి. అంటే మొదటేమో బృందంలో 17 మంది అవసరం లేదని, ఐదుగురు మాత్రం చాలని చెప్పింది. అదే సమయంలో వారం రోజుల పర్యటనను కేంద్రం నాలుగు రోజులకు కుదించింది. అయితే, కొన్ని గంటల్లోనే యథావిధిగా వారం రోజుల పర్యటనకు, 17 మంది బృందానికి కేంద్రం క్లియరెన్స్ ఇచ్చేసింది.
మరి కొద్ది గంటల్లోనే కేంద్రంలో ఏం జరిగింది ? ఇపుడిదే చర్చ అందరిలోను మొదలైంది. నిజానికి చంద్రబాబు ప్రతీ ఏడాది దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి జరుగుతున్న మేలేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా. ప్రపంచ ఆర్దిక సదస్సు నిర్వాహకుల నుండి ఎటువంటి ఆహ్వానం అందకపోయినా ప్రతీ ఏడాది చంద్రబాబు దావోస్ కు వెళ్ళొస్తున్నారు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటానికి తప్ప దావోస్ పర్యటన మరెందుకు ఉపయోగ పడటం లేదు. ఆ విషయం గ్రహించే కేంద్రం ఆంక్షలు విధించింది. కాకపోతే తెర వెనుక జరిగిన వ్యవహారంతో మళ్ళీ ఆంక్షలన్నింటినీ ఎత్తేసింది.
అంటే తాజాగా జరిగిన పరిణామాలతో నరేంద్రమోడి, చంద్రబాబు మధ్య గట్టి బంధమే నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. లేకపోతే ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరమే కేంద్రానికి లేదు. పైగా చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే అని అభిప్రాయపడిన మోది మరి ఎందుకు విచారణ చేయించటం లేదు ? పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ నిర్ధారించిన తర్వాత కూడా కేంద్రం ఏమీ పట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తోంది ? జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే మోడి, చంద్రబాబు నాటకాలు ఆడుతున్నట్లే అనుమానం వస్తోంది. రేపటి ఎన్నికల తర్వాత అవకాశం ఉంటే మళ్ళీ ఇద్దరు కలిసినా కలిసిపోతారని వైసిపి నేతలు చెబుతున్నది నిజమే అనిపిస్తోంది.