2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ కాంబినేషన్ను జనం కూడా మెచ్చుకున్నారు. ఈ నేత త్రయంలో అటు చంద్రబాబు, ఇటు మోడీ పార్టీలకు సీట్లు దక్కాయి. కానీ పవన్ కల్యాణ్ కు మాత్రం కేవలం ప్రశంసలే దక్కాయి.
పాపం.. ఆయన అంతలా బీజేపీ, టీడీపీ కోసం గత ఎన్నికల్లో కష్టపడితే కొందరు నేతలు మాత్రం ఆయనెవరో తెలియదని చెప్పడం ఆయన్ను బాధపెడుతోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తాను ఎవరో తెలియదని చెప్పడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బాధపడ్డారు.
తాను అశోక్ గజపతి రాజు విజయానికి కృషి చేస్తే... ఆయనేమో ఇప్పుడు తానెవరో తెలియదంటున్నారని పవన్ వాపోయాడట. విజయనగరం జిల్లా పార్టీ సమీక్షలో తన ఫీలింగ్ బయటపెట్టారు. అంతేకాదు.. తనను ఎవరెన్ని తిట్టినా ముందుకే వెళ్తానని చెబుతున్నాడు పవన్.
తనకు అనుభవం లేదని చెబుతున్న నేతలకూ పవన్ బాగానే కౌంటర్ ఇస్తున్నాడు. 2009, 2014లతో పాటు ఈ ఎన్నికలు కలిపితే తనకు మూడు ఎన్నికల్లో పని చేసిన అనుభవం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాలకూ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ మరోసారి నొక్కి చెప్పారు.