సినీ కమెడియన్ అలీ అనుహ్యంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మొన్నటికి మొన్న ఆయన వైసీపీ అధినేత జగన్తో భేటీ అయ్యారు. అరగంట పాటు సమావేశం అయ్యారు. దీంతో ఆయన వైసీపీలో చేరిపోతున్నారని వార్తలు వచ్చాయి. జగన్ తో భేటీ అవడంతో అంతా నిజమే అనుకున్నారు.
పవన్ కు సన్నిహితుడైన అలీ వైసీపీలో చేరడమేంటా అని కొందరు ఆశ్చర్యపోయారు. అలాంటి సమయంలో అదే అలీ.. అనూహ్యంగా ఒకేరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్నూ.. ఆ వెంటనే సీఎం చంద్రబాబును కలవడం కలకలం సృష్టిస్తోంది. అలీని పవన్ కల్యాణ్ .. జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ను కలిసిన తర్వాత అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఐతే.. అలీ ఏ పార్టీలో చేరాలన్న విషయంపై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోనట్టు తెలుస్తోంది. సినీ నిర్మాత, అశ్వనీదత్తో కలిసి అలీ ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలవడం కూడా ఆశ్చర్యపరుస్తోంది.
ఇన్ని భేటీల తర్వాత ఇప్పుడు అలీ ఏ పార్టీలో చేరతారనే అంశంపై అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు సినీవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. తన డిమాండ్లు వినిపించేందుకే ఆయన పార్టీల అధినేతలను కలుస్తున్నారా.. లేక ఈ నేతల మధ్య ఏదైనా రాయబారాలు చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నాయకులతో అలీ ఏం మాట్లాడారో ఆయనే చెప్పాలి.