మొన్న జరిగిన తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. అయితే కేసీఆర్ తో జగన్కు ఉన్న స్నేహం- అవగాహన కారణంగానే వైసీపీ పోటీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఆదివారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు.
కేసీఆర్ కు సాయంచేసేందుకే మీరు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదా అని యాంకర్ ప్రశ్నించగా.. జగన్ ఆసక్తికరంగా స్పందించారు. వాస్తవానికి తెలంగాణలో వైసీపీ పోటీకి దిగితే.. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు గెలిచేవారే కాదని చెప్పారు. వైసీపీ మేలు చేయాలనుకుంటే మేం పోటీలో దిగేవాళ్లమేనన్నారు.
తెలంగాణలో ఆ మేరకు వైసీపీకి క్యాడర్ ఉందని జగన్ అన్నారు. కానీ.. తాను తెలంగాణలో ఏమాత్రం తిరగలేదని.. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని తాను నమ్మడం లేదని జగన్ అన్నారు. తెలంగాణలో వచ్చిన ఏ సమస్యపైనా తాను స్పందించలేదని.. అందుకే తెలంగాణలో పోటీకి దిగలేదన్నారు.
ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించానని జగన్ తేల్చి చెప్పారు. ఏపీలో అధికారంలోకి రావడమే తమ ప్రధాన లక్ష్యమని జగన్ వివరించారు. మరి తెలంగాణలో మీ పార్టీ లేనట్టేనా.. అని యాంకర్ సూటిగా ప్రశ్నించగా.. వాస్తవంగానే లేదు.. ప్రస్తుతానికి లేదు.. అని నిజాయితీ సమాధానమిచ్చారు జగన్.