మోడీ, మిడిల్ మోడీ, జూనియర్ మోడీ.. ఇవీ కేసీఆర్, జగన్ లకు టీడీపీ పార్టీ ఇటీవల పెట్టుకున్న మారుపేర్లు.. మోడీ.. కేసీఆర్, జగన్లను అడ్టుపెట్టుకుని టీడీపీపై పోరాటం చేస్తున్నారని వారు ఆరోపిస్తుంటారు. కేసీఆర్, జగన్ స్నేహితులను తరచూ విమర్శిస్తుంటారు. అయితే ఈ ఆరోపణలపై జగన్ ఏమంటున్నారో చూద్దాం..
తాను అసలు ఇంతవరకూ ఒక్కసారి కూడా ప్రత్యేకంగా కేసీఆర్ను కలవలేదని జగన్ కుండబద్దలు కొట్టారు. ఆయన చేపట్టి పాదయాత్ర ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఓ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కూ తనకూ వయస్సులో చాలా తేడా ఉందని.. ఇద్దరం కలసే సందర్భం రాలేదని జగన్ చెప్పారు. అయితే కేసీఆర్ కు తాను ఇటీవలే ఫోన్ చేశానని జగన్ చెప్పుకొచ్చారు.
తానే కావాలనే కేసీఆర్కు ఫోన్ చేశానని వివరణ ఇచ్చారు. మొన్న తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి అభినందించానన్నారు. అన్నా.. తెలంగాణ ఎన్నికల్లో బాగా పోరాడినారన్నా.. చంద్రబాబును బాగా ఓడించారన్నా.. అని తాను కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పానని జగన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎందుకు ఫోన్ చేసారు అని విలేఖరి అడగగా.. చంద్రబాబు మీద గెలిచాడు కదా.. అంతకుమించి కావాల్సిందేముంది ఫోన్ చేయడానికి అన్నారు జగన్. మరి మీపై కేసీఆర్ ఎందుకు ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు.. 2014లో కూడా మీరే గెలుస్తారని కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు కూడా మీరే గెలుస్తారని చెబుతున్నారు.. అని విలేఖరి ప్రశ్నించారు. దానికి జగన్ స్పందిస్తూ హీరోవైపే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.. విలన్ వైపు కాదు కదా అని జగన్ సమాధానం ఇచ్చారు.