ఇచ్చాపురం వేదికగా జగన్ పార్టీకి సంబంధించిన కీలక ప్రకటన చేస్తారన్న టాక్ ఇపుడు గట్టిగా వినిపిస్తంది. మొత్తం 175 సీట్లకు గానూ 60 శాతం అభ్యర్ధుల జాబితాను జగన్ ప్రకటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ కంటే ముందే అభ్యర్ధులను అనౌన్స్ చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో కాక పుట్టించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటున్న టీడీపీపై పై చేయి సాధించాలని జగన్ భావిస్తున్నారు దాంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఎవరి పేర్లు జాబితాలో ఉంటాయి అన్న దానిపైన అభ్యర్ధులుగా భావిస్తున్న వారికి నూటొకటి కొడుతోంది.
తాను చుట్టేసిన 13 జిల్లాల్లో పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసిన జగన్ వద్ద అన్ని రకాల సర్వేలు ఉన్నాయి. వాటిని క్రోడికరించుకుంటూ వివాదాలు లేని చోట, గెలుపు అవకాశాలు ఖాయం అన్న చోట, సిట్టింగు ఎమ్మెల్యేలు ఉన్న చోట అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాల సమాచారం. దీనివల్ల పెద్దగా అసమ్మతి తలెత్తదని, ఒకవేళ ఎవరైనా నిరసన గళం వింపించినా సర్దుబాటు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంటుందన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి జనవరి 9న ఇచ్చాపురంలో అనేక సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు. చూడాలి.