వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మరోసారి దాడి జరగబోతోందా.. ఈసారి ఆధ్యాత్మికపరంగా దాడి చేయాలని ఆయన ప్రత్యర్థులు ప్లాన్ చేశారా.. అవునంటున్నాయి వైసీపీ వర్గాలు. జగన్ పాదయాత్ర ముగించుకున్న తర్వాత తిరుపతి వచ్చి శ్రీనివాసుడిని దర్శించుకోనున్నారు.
ఈ సమయంలో జగన్ పై హిందూత్వ దాడి జరిపేందుకు ప్రత్యర్థులు కుట్రపన్నారని.. ఆ పార్టీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. ఈ దాడిలో హిందూత్వ ముసుగులో సంఘ విద్రోహ శక్తులు కొన్నిటిని టీడీపీ వాడే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో హిందుత్వ దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం తమకు ఉందని ఆయన వివరిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలతోనే జై జగన్ నినాదాలు చేయించి.. ఈ దాడిని కూడా వైసీపీ కార్యకర్తలు చేసినట్టు చూపించే ప్రయత్నం కూడా జరుగుతుందని భూమన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా చంద్రబాబు చేయబోతున్న కుట్రగా భూమన వర్ణిస్తున్నారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో స్వామివారికి ఏటా పట్టువస్త్రాలు సమర్పించే వారని భూమన గుర్తు చేసుకున్నారు. వైసీపీ పై దుష్ప్రచారం జరగకుండా ఉండేందుకే ఈ కుట్ర గురించి చెబుతున్నామన్నారు. చంద్రబాబు తన రాజకీయాల కోసం దేవుడును కూడా వదలడని.. భూమన కరుణాకర్ రెడ్డి విమర్శిస్తున్నారు.