గత కొన్ని రోజులుగా హైదరాబాద మహానగరంలో చైన్ స్నాచర్లు వరుసగా చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇక పట్టపగలు ఒంటరిగా మహిళలు రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దాంతో ప్రభుత్వం పై విమర్శలు రావడంతో పోలీసులపై వత్తిడి వచ్చింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్నాచింగ్ ఉదంతాల నేపథ్యంలో రికార్డైన సీసీ కెమెరా ఫుటేజ్లో కేటీఎం వాహనం వెనుక కూర్చున్న స్నాచర్ ఓ ట్రావెల్ బ్యాగ్ను వెనుక వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు బయటి నుంచి వచ్చిన దుండగులే ఈ పని చేశారని ప్రాథమికంగా నిర్థారించారు.
ఆపై వాహనం సైతం లభించడంతో లోతుగా ఆరా తీశారు. దొంగల కోసం ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వెళ్లి ఆధారాలు సేకరించారు. చివరికి దొంగలు ముగ్గురూ హైదరాబాద్లోనే ఉన్నారని తెలుసుకుని నిఘా పెట్టారు. దొంగలను నోయిడాకు చెందిన మోనా వాల్మీకి, బులంద్షహర్కు చెందిన చోకా, హైదరాబాద్కు చెందిన చింతమళ్ల ప్రణీత్ చౌదరిగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి డిపోర్టేషన్పై తిరిగి వచ్చి నేర జీవితాన్ని ఎంచుకున్న ప్రణీత్ చౌదరే ఈ ముఠాకు సూత్రధారిగా తేల్చారు.
టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠా ఆట కట్టించడమే కాకుండా వారినుంచి మొత్తం సొత్తును రికవరీ చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. వీరి నుంచి 350 గ్రాముల బంగారం, రెండు బైక్లు, ఒక డాగర్ను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కలిసి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, బులంద్షహర్లలో 150కిపైగా దొంగతనాలు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. కాగా, ప్రణీత్ చౌదరి తాను బసచేసిన హోటల్ బిల్లును గూగుల్ పే ద్వారా చెల్లించాడని, నిందితులను పట్టుకోవడంలో ఈ లావాదేవీ కీలకం అయిందని సీపీ తెలిపారు.