వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి
చేసింది పాదయాత్రే కాదట. స్వార్ధంతో చేసిన రాజకీయ యాత్రట. అలాగని చంద్రబాబునాయుడు
చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ జగన్ చేసిన
పాదయాత్రలో చిత్తశుద్ది లేదన్నారు. తాను కూడా పాదయాత్ర చేశానని ఓ పవిత్ర భావనతో
చేసినట్లు చెప్పుకున్నారు. చంద్రబాబుకు మొదటి నుండి ఓ అలవాటుంది. తాను చేస్తేనే
సంసారం. ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటారు. నిజానికి జగన్ చేసిన పాదయాత్ర
రికార్డులను తిరగరాసింది. 341 రోజులు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేయటమంటే మామూలు
విషయం కాదు. దాదాపు 14 మాసాలు జనాల్లోనే గడిపేశారు.
జగన్ పాదయాత్ర రికార్డులు కళ్ళముందు అంత స్పష్టంగా కనిపిస్తున్నా అంగీకరించటానికి చంద్రబాబుకు మనస్సు రావటం లేదు. జగన్ గొప్పతనాన్ని చంద్రబాబు ఒప్పుకోకపోయినా వైసిపికి వచ్చే నష్టమేమీలేదు. కానీ పాదయాత్రను తక్కువ చేసి మాట్లాడటంతోనే చంద్రబాబులోని చవకబారుతనం బయటపడుతోంది. చంద్రబాబు కూడా ఒకపుడు పాదయాత్ర చేసిన వ్యక్తే. ఆ వయస్సులో చంద్రబాబు పాదయాత్ర చేసినందుకు మెచ్చుకోవాల్సిందే. పాదయత్ర చేసినపుడు చంద్రబాబును అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు కానీ జగన్ కానీ తక్కువ చేసి మాట్లాడలేదు.
మరి ఇఫుడు చంద్రబాబు మాత్రం జగన్ ను ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు ? ఎందుకంటే, పాదయాత్రతో జనాల్లో జగన్ చొచ్చుకుని వెళ్ళిపోయినట్లు చంద్రబాబుకు స్పష్టంగా అర్ధమైంది. తన పాలనలో వ్యతిరేకంగా ఉన్న జనాలంతా పాదయాత్రలో జగన్ కు సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా చంద్రబాబు గమనించారు. రేపటి ఎన్నికల్లో జగన్ ఎక్కడ విజయం సాధిస్తారో అన్న భయమే చంద్రబాబులో కనబడుతోంది. పాదయాత్ర జరిగినంత కాలం ఎప్పటికప్పుడు నివేదికలను చంద్రబాబు తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే.
జగన్ పాదయాత్ర రేపటి ఎన్నికల్లో ఎక్కడ తన కొంప ముంచుతుందో అన్న ఆందోళనే చంద్రబాబు మాటల్లో కనబడుతోంది. తాను చేసిన పాదయాత్ర పవిత్ర భావంతో చేసినట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. అప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేసినా ఇఫుడు జగన్ చేసినా అధికారం కోసమే చేశారాన్నది స్పష్టం. అంతకుముందు వైఎస్ చేసిన పాదయాత్ర కూడా అధికారం కోసమే అనటంలో సందేహాలు అవసరం లేదు. కాబట్టి పాదయాత్రల్లో పవిత్రభావం, అపవిత్రభావం అన్నది ఉండదు.
పాదయాత్ర వల్ల లాభమా ? నష్టమా ? అని మాత్రమే చూస్తారు. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కష్టమే అని జగన్ అనుకుంటే పాదయాత్ర చేసుండే వారు కాదేమో ? అలాగే, చంద్రబాబు కూడా పాదయాత్ర చేసేంత ధైర్యం చేసేవారు కాదు. చంద్రబాబు మీద జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను జగన్ గమనించారు. రేపటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్లాన్ చేశారు. పాదయాత్రకు శ్రీకారం చుట్టి విజయవంతంగా ముగించారు. పైగా పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రులవుతారన్న సెంటిమెంటు ఒకటుంది. అదే ఇపుడు చంద్రబాబును భయపెడుతోంది. మరి రానున్న ఎన్నికల్లో జగన్ విషయంలో జనాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.