ఎట్టకేలకు జగన్ తన పాదయాత్ర ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురైనా ఎక్కడ కూడా తగ్గకుండా ఎండకు, వానకు అలుపెరుగని పోరాటం చేశాడు. అయితే జగన్ తరువాతి కార్యాచరణ ఏంటని ఇప్పడూ అందరి మదిలో మెదులుతుంది. అంచనాలకు మించి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమయ్యింది, విజయవంతంగా ముగిసింది కూడా. ఇక, ఇప్పుడు అసలు కథ మొదలయ్యింది. వైఎస్ జగన్, ఇచ్చాపురం నుంచి తిరుపతికి పయనమయ్యారు.
కలియుగ ప్రత్యక్షం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆ తర్వాత ఇడుపులపాయకు వెళతారు. 'ఇన్ని రోజులు పాదయాత్ర చేశాం కదా, రెస్ట్ తీసుకుందాం' అనే ఆలోచన జగన్లో వున్నట్లు కన్పించడంలేదు. వీలైనంత అగ్రెసివ్గా ఇకపై వ్యవహరించాలనే నిర్ణయంతో వున్నారట వైఎస్ జగన్. సంక్రాంతి సంబరాలు ఓ పక్క, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ఇంకోపక్క.. వెరసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంక్రాంతి కొత్త జోష్ నింపబోతోందని వైఎస్సార్సీపీకి చెందిన ఓ ముఖ్య నేత వ్యాఖ్యానించడం గమనార్హం.
అమరావతిలో వైఎస్ జగన్ తన సొంత ఇంటి నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అమరావతిలో పార్టీ కార్యాలయం పనులు కూడా వేగం పుంజుకోబోతున్నాయి. ఇకపై పార్టీ కార్యక్రమాలన్నీ అమరావతి నుంచే జరుగుతాయట కూడా.! అభ్యర్థుల ఎంపిక, గ్రామ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపి, ఎన్నికలకు సంసిద్ధం చేయడం.. ఇలా చాలా పనులే వున్నాయి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయాల్సినవి. వాటికి సంబంధించిన రూట్ మ్యాప్ ఆల్రెడీ ఖరారయ్యిందనీ, జగన్ ఎన్నికల యుద్ధ రంగంలోకి దూకడమే తరువాయి అనీ వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.